Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 9 గంటల వరకూ 11.2 శాతం పోలింగ్ నమోదైంది. సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో, మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు క్యూలైన్ల్ లో నిరీక్షిస్తున్నారు. రెండు బూత్ లలోనే ఈవీఎంలు మొరాయించాయనీ, వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించామని ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. చెకింగ్ పాయింట్స్ వద్ద లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
కాగా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మునుగోడు పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మర్రిగూడలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. స్థానికేతరులు ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ ఆరోపించింది. నాన్ లోకల్ టీఆర్ఎస్ నేతలు ఉన్నారంటూ బీజేపీ నేతలు చండూరు మండల కేంద్రంలో ఆందోళనకు దిగగా బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారిగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పుట్టపాకలో నాన్ లోకల్స్ ఉండటాన్ని అబ్జర్వర్ గుర్తించారు. నగదు, ఇతర సామాగ్రీ స్వాధీనం చేసుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధి కుసుకుంట్ల ప్రభాకరరెడ్డి, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డి, స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో ఉన్న ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ లు వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకుంటున్నారు.