మునుగోడులో తన ఓటమిపై సంచలన కామెంట్స్ చేశారు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి కుసుకుంట్ల ప్రభాకరరెడ్డి పదివేలకు పైగా మెజార్టీతో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు.
ఎన్నికల ఫలితంపై ఆదివారం మీడియాతో మాట్లాడని పాల్వాయి స్రవంతి ఇవేళ తన స్వగ్రామం చండూరు మండలం ఇడికుడలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తన ఓటమికి గల కారణాలను వివరించారు. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ తో పాటు బీజేపీ తప్పుడు అంశాలతో ప్రచారం సాగించారని ఆరోపించారు. తాను కేసిఆర్ ను కలవకపోయినా ఆయనను కలిసినట్లుగా ఓ మార్ఫింగ్ ఫోటో సృష్టించి దాన్ని సోషల్ మీడియా ద్వారా వైరల్ చేశారన్నారు. దీని ప్రభావం తన ఎన్నికల ప్రచారం, తనకు పడే ఓట్లపైనా పడిందని అన్నారు.
బీజేపీ కోవర్టు రాజకీయాలకు పాల్పడిందని స్రవంతి ఆరోపించారు. ఓటర్లకు కల్తీ మద్యం పంపిణీ చేసి వారిని అనారోగ్యం బారిన పడేశారని అన్నారు. బీ జే పీ మాదిరిగానే తమ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కోవర్టు రాజకీయాలే చేశారని విమర్శించారు. ఎన్నికల్లో తనకు ద్రోహం చేసిన వెంకటరెడ్డిపై చర్యలు ఉంటాయో లేదో పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందని స్రవంతి అన్నారు. ఎన్నికల అధికారులు కూడా తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోయారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ తో పాటు బీ జే పీ కూడా ఓటర్లకు ప్రలోభాలకు గురి చేసిందని స్రవంతి ఆరోపించారు.