Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఓట్ల లెక్కింపునకు సంబంధించి రౌండ్ ల వారిగా ఫలితాల వెల్లడి ఆలస్యం అవుతుండటంపై బీజేపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి (సీఈఓ) వికాస్ రాజ్ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆలస్యంగా జరుగుతున్న మాట వాస్తవమేననీ, అందుకు కారణాలు ఉన్నాయన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో మొత్తం 47 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారని చెప్పారు. ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్ధులు పోటీ చేస్తున్న కారణంగానే ఓట్ల లెక్కింపు అనుకున్న దాని కంటే ఆలస్యంగా జరుగుతోందని ఆయన తెలిపారు. మిగిలిన రాష్ట్రాల్లో ఇంత సంఖ్యలో అభ్యర్ధులు లేకపోవడం, అయిదు ఆరుగురు అభ్యర్ధులు మాత్రమే పోటీలో ఉండటం వల్ల ఓట్ల లెక్కింపు చురుగ్గా సాగుతున్నదని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ రహస్యంగా ఏమీ సాగడం లేదనీ, రిటర్నింగ్ అధికారి, పరిశీలకుడుతో పాటు ఆయా అభ్యర్ధులకు చెందిన ఏజంట్ల సమక్షంలోనే జరుగుతోందని ఆయన తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల ఆరోపణలను ఆయన వద్ద ప్రస్తావించగా, ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని చెప్పారు. ఫిర్యాదులు అందితే వాటిపై పరిశీలన చేసి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని సీఇఓ వికాస్ రాజ్ తెలిపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?