మునుగోడు ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. వచ్చే ఏడాది వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నిక సెమీ ఫైనల్ గా భావిస్తుండటంతో ప్రధాన రాజకీయ పక్షాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నాయి. రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ ను మోడీ ఇచ్చినందు వల్లనే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారని ఆరోపిస్తున్నాయి. యాదాద్రి ఆలయాన్ని వెయ్యి కోట్లతో నిర్మిస్తే ప్రధాని మోడీ వంద రూపాయల చందా కూడా ఇవ్వలేదంటూ మంత్రి జగదీశ్వరరెడ్డి విమర్శించారు. రాజగోపాల్ రెడ్డికి మాత్రం రూ.18వేల కాంట్రాక్ట్ ను మోడీ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన రూ.18 వేల కోట్లు నల్లగొండ, మునుగోడు అభివృద్ధికి కేటాయిస్తే పోటీ నుండే తప్పుకుంటామని టీఆర్ఎస్ ప్రకటిస్తొంది. కాంగ్రెస్ పార్టీ కూడా రాజగోపాల్ రెడ్డి పై రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్ పైనే ఆరోపణలు ఎక్కుపెడుతోంది.
ఇదే తరుణంలో టిఆర్ఎస్ సర్కార్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ సంచలన ఆరోపణ చేశారు. ఈ ఆరోపణలపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. కెసిఆర్ కుటుంబం ధరణి పోర్టల్ తీసుకొచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 18 లక్షల కోట్ల రూపాయిల భూములు ఆక్రమించారని కోమటిరెడ్డి రాజగోపాల్ సంచలన ఆరోపణ చేశారు. ఇది దేశంలోనే అతి పెద్ద భూ స్కాం గా ఆయన అభివర్ణించారు. ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. దేశంలోనే అతి పెద్ద భూస్కామ్ కు కేసిఆర్ కుటుంబం పాల్పడితే కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ఏమి చేస్తుందని ప్రశ్నిస్తున్నారు.18 అంకే రాజగోపాల్ రెడ్డి ని ఎంత కుంగదీసిందో ఈ ఆరోపణ బట్టే అర్ధం అవుతుందని అంటున్నారు నెటిజన్లు.
కెసిఆర్ కుటుంబం ధరణి పోర్టల్ తీసుకొచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 18 లక్షల కోట్ల రూపాయిల భూములు ఆక్రమించారు.
ఇది దేశంలోనే అతి పెద్ద భూ స్కాం !
ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి.
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) October 12, 2022