Murder: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు సంభవిస్తున్నాయి. కరోనాతో మృతి చెందిన వారి వద్దకు బంధువులు వెళ్లడానికి భయపడుతున్నారు. ఇదే అదనుగా కొందరు ప్రభుద్దులు వారు చేసిన హత్యను కరోనా లెక్కలో వేసి తప్పించుకోవాలని మంచి పథకం రచించి అమలు చేశారు, కానీ అది అడ్డం తిరిగింది. బండారం బయటపడింది. జైలుకు వెళ్లల్సాల్సి వచ్చింది.
విషయంలోకి వెళితే .. నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం హాసాకొత్తూరుకి చెందిన మాలవత్ సిద్ధార్థ (17) అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ రాజకీయ పార్టీ నాయకుడి బంధువుల యువతి ప్రేమించుకుంటున్నారు. అయిదారు నెలలుగా ఇద్దరూ వాట్సాప్ ఛాటింగ్ చేసుకుంటున్నారు. ఈ విషయం ఆ యువతి బంధువైన రాజకీయ నాయకుడు రాజేష్ కు తెలిసింది. వెంటనే రాజేష్ అతని మిత్రులైన దోస్ పాల్, పృధ్విరాజ్, జుంబరాత్ అన్వేష్ తో కలిసి సిద్ధార్థను కలిసి ప్రేమ వ్యవహారం మానుకోవాలంటూ హెచ్చరించారు. ఆ తరువాత అతని అన్నయ్య కృష్ణను కూడా కలిసి వీరు హెచ్చరించారు. అయినప్పటికీ వీరి హెచ్చరికలు లెక్కచేయకుండా సిద్ధార్థ, ఆ యువతి తమ ప్రేమాయాణాన్ని కొనసాగించారు.
ఈ నేపథ్యంలో సిద్ధార్థను కొడితేనే దారికి వస్తాడని భావించిన రాజేష్ తన మిత్రులను పురమాయించగా వారు ఇటీవల సిద్ధార్థను కొట్టి గాయపర్చారు. అయితే బలమైన గాయాలు కావడంతో మెట్ పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రికి వెళ్లే సమయానికి అతను మృతి చెందడంతో దీన్ని కోవిడ్ మరణం లెక్కలో వేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామ ఉప సర్పంచ్ కి ఫోన్ చేసి సిద్ధార్థ కరోనాతో మృతి చెందాడనీ కుటుంబ సభ్యులకు చెప్పి అంత్యక్రియలకు ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామానికి చెందిన పీఎంపీ వైద్యుడు తో మాట్లాడి కరోనా కారణంగానే సిద్ధార్థ చనిపోయినట్లు కుటుంబ సభ్యులను నమ్మించారు. అంబులెన్స్ కు కూడా కరోనా మృతిగానే చెప్పి మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి చేర్చారు.
ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్న సిద్ధార్థ కుటుంబ సభ్యులు ఎందుకో అనుమానం వచ్చి సిద్ధార్థ మృతదేహాన్ని పరిశీలించారు. సిద్ధార్థ వంటిపై గాయాలు ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా మొత్తం వ్యవహారం బయటపడింది. ఈ కేసులో రాజేష్ తో పాటు పృధ్విరాజ్, అన్వేష్, బాలాగౌడ్, మథీన్ లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఘటనలో పాల్గొన్న మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నారు. ఈ హత్యను కరోనా లెక్కలో వేసి తప్పించుకోవాలన్న వారి ప్లాన్ బెడిసి కొట్టి కటకటాల పాలైయ్యారు.