Eatela Rajendar: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు కీలక సవాల్. టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్లో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. ఈటల వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ, జనగామ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై తాజాగా ముత్తిరెడ్డి ఏకంగా ఓపెన్ చాలెంజ్ విసిరారు.
ఈటల ఎపిసోడ్లో ఎన్నో ట్విస్టులు
ఈటల వ్యవహారంపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అనేక ఎకరాలు కబ్జా చేసినట్లు ఆరోపించారు. దీనిపై ముత్తిరెడ్డి స్పందిస్తూ అరవై ఎకరాలలో గుంట భూమి కబ్జా చేసినట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. నన్ను ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజల ముందు అప్పీల్ చేస్తున్నా… జనగామ చౌరస్తాలో అంబేద్కర్ పాదాల వద్ద ముక్కు నేలకు రాసి… రాజీనామా మాత్రం అంబేద్కర్ పాదాల వద్ద ఉంచి ముఖ్యమంత్రి కేసీఆర్కు అందజేస్తానను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు ఏం జరగనుంది?
ఈటల ఎపిసోడ్ నేపథ్యంలో భూకబ్జా ఆరోపణలు, నిర్ధారణలు, మంత్రి పదవి ఊడపీకడం, ఆ తర్వాత బర్తరఫ్ చేయడం జరిగిపోయింది. ఇదే సమయంలో ముత్తిరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్గా మారిపోయింది. అయితే, గతంలో పలు సందర్భాల్లో ముత్తిరెడ్డిపై ఆరోపణలు రాగా.. ఇప్పుడు ఆయనే సవాల్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ముత్తిరెడ్డి భూముల లెక్క కూడా తేలిస్తే ఇటు ముత్తిరెడ్డి సేఫ్ అటు గులాబీ దళపతి సైతం సేఫ్ గా ఉంటారని అంటున్నారు.