MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై సినీ నటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో నాలుగు రోజుల్లో మా ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇరు ప్యానెల్స్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో మాటల యుద్ధం కొనసాగుతోంది. మా ఎన్నికల పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠతను కల్గిస్తున్నాయి. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మద్య పోటీ నువ్వా నేనా అన్నరీతిలో జరుగుతుండగా తెలుగు సినీ పరిశ్రమ రెండు గ్రూపులుగా విడిపోయినట్లు కనబడుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం నాగబాబు ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు మద్దతుగా మాట్లాడారు. తన స్నేహితుడు నరేష్ ప్రతి చిన్న చిన్న విషయాలకు మీడియా సమావేశాలను ఏర్పాటు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అసోసియేషన్ సభ్యులతో కూర్చుని మాట్లాడుకునే అంశాలకూ మీడియా ముందుకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు.
MAA Elections: ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు మెగా బ్రదర్స్ మద్దతు
మెగా బ్రదర్స్ మద్దతు ప్రకాశ్ రాజ్ కేనని స్పష్టం చేసిన నాగబాబు.. ప్రకాశ్ రాజ్ కు సపోర్టు చేయాలని అన్న చిరంజీవే తనకు సూచించారని అన్నారు. అన్న చిరంజీవికి ప్రకాశ్ రాజ్ మంచి స్నేహితుడని చెప్పారు. గత ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ కు మద్దతు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాను మద్దతు ఇవ్వడం వల్లనే నరేష్ ప్యానెల్ గెలిచిందని తాను చెప్పనని అన్నారు. ప్రకాశ్ రాజ్ స్థానికుడు, తెలుగు వాడు కాదని ప్రత్యర్ధులు చేస్తున్న ఆరోపణలను నాగబాబు తీవ్రంగా ఖండించారు. ప్రకాశ్ రాజ్ భారతీయ నటుడనీ, ఆయన తెలుగు వాడు కాదని విమర్శించే వాళ్లు సినిమాల కోసం ఎలా కావాలంటారని ప్రశ్నించారు. చిన్న పెద్దా సినిమా ఏదైనా వాళ్లకు ప్రకాశ్ రాజ్ కావాలని అన్నారు. ఉత్తమ స్థాయి నటుడుగా ప్రకాశ్ రాజ్ ను అందరూ ఒప్పుకోవాల్సిందేనన్నారు. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తారని అస్సలు తాను ఊహించలేదనీ, అసోసియేషన్ కోసం కొన్ని సినిమాలు కూడా వదులుకుంటానని ఆయన చెప్పారన్నారు. ఒక్క సినిమాకు కోటి రూపాయలు తీసుకునే దమ్మున్న నటుడు ప్రకాశ్ రాజ్ అని అంత మొత్తం వదులుకుని మా కోసం పని చేయడానికి వచ్చారని అన్నారు. ప్రకాశ్ రాజ్ ను విమర్శించే వారు వేరే భాషల్లో నటించడంలేదా అని ప్రశ్నించారు.
ఓటుకు 10వేలు ఇస్తున్నారంటూ ఆరోపణ
మా ఎన్నికల్లో గెలిచేందుకు సభ్యులకు డబ్బు ఆశ చూపుతున్నారని నాగబాబు విమర్శించారు. ఒక్కో ఓటరుకు రూ.10వేలు ఇస్తున్నారనీ, కొద్ది రోజుల తరువాత మరి కొంత నగదు ఇస్తామని చెబుతున్నారని ఆరోపించారు. మా అసోసియేషన్ మసకబారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల ప్రతిష్టను దిగజార్చడానికి కొందరు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రకాశ్ రాజ్ మూడు సార్లు మా కు అధ్యక్షుడిగా ఉండాలనీ, ఆయన ఉంటేనే మా బాగుపడుతుందని నాగబాబు పేర్కొన్నారు.