BRS: తెలంగాణ ఎన్నికల వేళ వివిధ పార్టీల్లోని అసంతృప్తులు ప్రత్యర్ది పార్టీల్లో చేరుతున్నారు. ఇటీవల కాలం వరకూ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో నేతలు చేరగా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో టికెట్ లు ఆశించి భంగపడిన వారు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నాగం జనార్థన్ రెడ్డి నాగర్ కర్నూల్ టికెట్ ఆశించారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైయ్యారు. తన అనుచరులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయం మేరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నాగం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఆయనకు బీఆర్ఎస్ నుండి ఆహ్వానం అందింది.
మంత్రులు కేటిఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితర బీఆర్ఎస్ నేతలు ఆదివారం సాయంత్రం నాగం నివాసానికి వెళ్లి ఆయనను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. మంత్రుల ఆహ్వానం పట్ల ఆయన సుముఖత వ్యక్తం చేశారు. నాగంతో భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తమ అహ్వానం మన్నించిన నాగం జనార్థన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ తరపున, ఆయన సూచనల మేరకు నాగం జనార్థన రెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించడం జరిగిందన్నారు. పార్టీలో ఆయనకు, ఆయన అనుచరులకు సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. సీఎం కేటిఆర్, నాగం చిరకాల మిత్రులనీ, వారిద్దరిది 40 ఏళ్ల స్నేహం ఉందన్నారు. మొదటి నిండి నాగం తెలంగాణ వాది అని అనన్నారు. అందరం సమిష్టిగా ఎన్నికల్లో కలిసి పని చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యకరత్ల కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగిందని చెప్పారు. మంత్రులు కేటిఆర్, హరీష్ రావులు బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారనీ, త్వరలోనే ఆ పార్టీలో చేరతానని చెప్పారు. కాంగ్రెస్ అద్వాన్న స్థితిలోకి వెళ్లిందన్నారు. చెవెళ్ల కాంగ్రెస్ సభకు తాను 50 వేల మందిని తరలించానని అన్నారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను కాంగ్రెస్ తుంగలో తొక్కిందన్నారు. తనకు టికెట్ ఎందుకు రాలేదని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే.. సునీల్ కనుగోలు టీమ్ సర్వే ఆధారంగా టికెట్ ఇచ్చామని చెప్పారన్నారు. మొదటి నుండి జెండా పట్టుకుని పని చేసిన వారికి టికెట్ ఇవ్వకుండా డబ్బులు ఉన్న వారికే టికెట్ ఇస్తున్నారని ఆరోపించారు. నాగర్ కర్నూల్ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ లో చేరుతున్నాననీ, ఎమ్మెల్యే మర్రి జనార్తన్ రెడ్డితో కలిసి పని చేస్తానని తెలిపారు.