Nama Nageswararao: ఇటీవల టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు నివాసం, కార్యాలయాలపై ఈడీ సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఆయన నివాసంతో పాటు మధుకాన్ కంపెనీ డైరెక్టర్ ల నివాసాలలోనూ సోదాలు నిర్వహించారు. విచారణకు హాజరుకావాలంటూ నామాతో సహా డైరెక్టర్ లకు ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారాలపై తొలి సారిగా నేడు నామా నాగేశ్వరరావు స్పందించారు.
40 ఏళ్ల క్రితమే మధుకాన్ సంస్థను స్థాపించిన తాను 20 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నానన్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టామని తెలిపారు. రాంచీ ఎక్స్ ప్రెస్ వే ఎస్పీవీ కంపెనీ.. బీవోటీ పద్ధతిలోనే రాంచీ నేషనల్ హైవే ప్రాజెక్టు చేపట్టిందని తెలిపారు. అయితే పలు విచారణల వల్ల హైవే అభివృద్ధి పై సంస్థ వెనక్కు వెళ్లిందన్నారు. అయితే ఈ ప్రాజెక్టులో నిధులు మళ్లించే అవకాశమే లేదన్నారు.
Read More: EAPCET: ఎంసెట్ షెడ్యూల్ ను ప్రకటించిన ఏపి విద్యాశాఖ మంత్రి సురేష్..!!
తాను ప్రస్తుతం ఏ సంస్థలోనూ డైరెక్టర్ గా లేననీ అయినప్పటికీ ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు నామా నాగేశ్వరరావు. తాను సంస్థ డైరెక్టర్ గా లేకపోయినా ఈడీ నోటీసు జారీ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన బలం కేసిఆర్, ఖమ్మం ప్రజలేనని పేర్కొన్న నామా.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను టిఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
రాంచీ నేషనల్ హైవే ప్రాజెక్టు కోసం బ్యాంకుల నుండి తీసుకున్న రుణాల్లో కొంత మొత్తాన్ని అక్రమార్గాల్లో మళ్లించారన్న అభియోగాలపై సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల సోదాలు నిర్వహించి విచారణకు హజారుకావాలంటూ ఈడీ సమన్లు జారీ చేసింది.