YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.30వేల పూచీకత్తుతో కూడిన రెండు షూరిటీలు సమర్పించాలనీ, పాస్ పోర్టు సరెండర్ చేయాలని, దేశం విడిచి బయటకు వెళ్లరాదనీ, విదేశాలకు వెళ్లాలనుకున్నప్పుడు న్యాయస్థానం అనుమతి తీసుకునే వెళ్లాల్సి ఉంటుందని, పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు హజరుకావాలని న్యాయస్థానం పేర్కొంది. నిన్న పోలీసులపై దాడి చేసిన కేసులో షర్మిలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు షర్మిలను నాంపల్లి కోర్టుకు హజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు.
అయితే ఆ వెంటనే షర్మిల తరపు న్యాయవాదులు రాత్రే బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా పోలీసులు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో బెయిల్ పిటిషన్ పై విచారణ నేటికి వాయిదా వేశారు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి. దాంతో నిన్న రాత్రి షర్మిల ను చంచల్ గూడ జైలుకు తరలించారు. నాంపల్లి కోర్టు షర్మిలకు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఈ సాయంత్రానికి షరతులు అన్నీ పూర్తి చేసి జైలు నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది.
బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టులో వాదనలను బలంగా వినిపించామని షర్మిల తరపు న్యాయవాది సంతోష్ తెలిపారు. పదుల సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టడంతో తోపులాట క్రమంలో జరిగిందే తప్ప ఉద్దేశపూర్వకంగా పోలీసులపై చేయి చేసుకోలేదని నిరూపించామని సంతోష్ తెలిపారు. మరో గంటలో ఆర్డర్ కాపీ వస్తుందని తెలిపారు. ఆ పై సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య షర్మిల జైలు నుండి బయటకు వస్తారని తెలిపారు.
Proddatur (Kadapa): ప్రొద్దుటూరులో కలకలం రేపిన సునీతారెడ్డి వాల్ పోస్టర్లు