NIA Raids: తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఏన్ఐఏ) సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిజామాబాద్, హైదరాబాద్, కర్నూలు, కడప, గుంటూరు, నెల్లూరు జిల్లాలో ఈ వేకువ జాము నుండి సోదాలు కొనసాగుతున్నాయి. పీపుల్స్ ఫ్రంట్ ఇండియా (పీఎఫ్ఐ) ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నారన్న అభియోగంతో ఎన్ఐఏ ఈ సోదాలు చేపట్టింది. ఈ ప్రాంతాల్లోని కొందరు విదేశాల నుండి నగదు బదిలీ, బ్యాంకు ఖాతాల లావాదేవీలు జరిపినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, నంద్యాల, నెల్లూరు లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా భోదన్ లో ఎన్ఐఏ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి సోదాలు చేస్తున్నారు. బైంసా అల్లర్లతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో కూడా ఎన్ఐఏ సోదాలు చేస్తుంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లో పీఎఫ్ఐ జిల్లా కన్వీనర్ షాదుల్లా, ఇమ్రాన్, మోబిన్ లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. కరాటే శిక్షణ, లీగల్ అవేర్ నెస్ పేరుతో యువతను ఉగ్రవాద కార్యకలాాపాల వైపునకు మళ్లిస్తున్నారని ఎన్ఐఏ గుర్తించింది. ఏపిలోని నంద్యాలలో పీఎఫ్ఐ జిల్లా కన్వీనర్ యూసుఫ్ నివాసంలో కూడా ఎన్ఐఏ సోదాలు చేస్తున్నది. మత కల్లోలాలు సృష్టించేందుకు యత్నాలు చేస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. నంద్యాలలో ఎన్ఐఏ సోదాలను నిరసిస్తూ పీఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళన చేశారు. గతంలోనూ నంద్యాలలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెం ఖాజానగర్ లోని ఇలియాజ్, అతని స్నేహితులు నివాసాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. తొలుత ఇక్కడ ఎన్ఐఏ అధికారుల వాహనాలను అనుమానితులకు చెందిన వారు అడ్డుకుని ఆందోళన చేశారు. దీంతో ఎన్ఐఏ అధికారులకు, ఆ ప్రాంత వాసులకు వాగ్వివాదం చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల సహకారంతో ఎన్ఐఏ అధికారులు సోదాలను కొనసాగిస్తున్నారు. పలు రికార్డులు కూడా ఎన్ ఐ ఏ అధికారులు సీజ్ చేసినట్లు గా తెలుస్తొంది. ఉమ్మడి కడప జిల్లాలో కూడా ఎన్ఐఏ అధికారుుల సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి వివిద సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసిన ఎన్ఐఏ అధికారులు.. పలువురు అనుమానితులకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. రేపు హైదరాబాద్ లోని ఎన్ఐఏ కార్యాలయంలో విచారణకు హజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు.