హైదరాబాద్ నగరంలో భారీ ఉగ్ర కుట్రకు ఐఎస్ఐ ప్లాన్ చేసింది. ఈ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. దసరా ఉత్సవాల్లో హైదరాబాద్ లో పలు ప్రదేశాల్లో పేలుళ్లు జరిపి మారణహోమం సృష్టించేందుకు ఐఎస్ఐ ప్రణాళిక రచించింది. అయితే నిఘా వర్గాల సమాచారంతో సీట్ పోలీసులు అప్రమత్తమై పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులతో లింకులు ఉన్న జాహిద్ ను అదుపులోకి తీసుకుంది సిట్ బృందం. జాహిద్ అరెస్టుతో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
దసరా వేడుకల్లో హైదరాబాద్ లోని పలు జనసామర్థ్యం ఉన్న ప్రాంతాల్లో పేలుళ్లతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలపై దాడులు చేయాలని జాహిద్ నేతృత్వంలో ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు. హైదరాబాద్ లో విధ్వంసం సృష్టించాలని పాకిస్థాన్ ఐఎస్ఐ నుండి జాహిద్ కు ఆదేశాలు అందాయనీ, అందుకు గానూ నాలుగు గ్రనేడ్స్ను పంపినట్లు గుర్తించారు. సోదాల్లో భాగంగా నిందితుల నుండి నాలుగు గ్రనేడ్లు, పేలుడు సామాగ్రితో పాటు రూ.,5.41 లక్షల నగదు, అయిదు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ క్రమంలో జాహిద్ అండ్ టీమ్ పై హైదరాబాద్ సీసీఎస్, సిట్ కేసు నమోదు చేశారు. అబ్దుల్ జాహిద్ తో పాటు మహమ్మద్ సమీఉద్దీన్, మాజ్ హసన్ ఫరూక్ లను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు జాహిద్ పలు బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. తాజాగా హైదరాబాద్ లో దాడుల కోసం జాహిద్ టీమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఉగ్రభావాలు ఉన్న యువకులను తన టీమ్ లోకి తీసుకున్నాడు. ఇప్పటి వరకూ తన టీమ్ లోకి ఆరుగురిని తీసుకున్న గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తొంది.