Breaking: తెలంగాణలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కుతున్న వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఫోన్ చేసి పరామర్శించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ రోజు షర్మిలకు ఫోన్ చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల జరిగిన షర్మిలకు జరిగిన ఘటనపై ఆరా తీసినట్లుగా తెలుస్తొంది. దాదాపు పది నిమిషాలు షర్మిలతో మోడీ మాట్లాడినట్లు సమాచారం. షర్మిలపై టీఆర్ఎస్ సర్కార్ అమానుషంగా వ్యవహరించిన తీరుపై నిన్న జీ 20 సమీక్షా సమావేశానికి హజరైన షర్మిల సోదరుడు, ఏపి సీఎం వైఎస్ జగన్ వద్ద కూడా ప్రధాని మోడీ ప్రస్తావిచినట్లుగా ప్రచారం జరుగుతోంది. షర్మిల అరెస్టుపై కనీసం ఖండించకపోవడంపై సీఎం జగన్ ను మోడీ ప్రశ్నించారని సమాచారం. షర్మిల కారులో ఉండగానే క్రేన్తో లిఫ్ట్ చేసి లాక్కెళ్లిన తీరు తనకే బాధ కలిగించిందని మోదీ వ్యాఖ్యానించారుట.
ఇటీవల వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో ఆమె కాన్వాయ్పై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయి. ఈ దాడికి నిరసనగా ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న వైఎస్ షర్మిలను పంజాగుట్టలో పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల సహా నలుగురు వ్యక్తులు ఉండగానే కారును క్రేన్తోనే లిఫ్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత పీఎస్ వద్ద బలవంతంగా కారు డోర్లు తెరిచి షర్మిలను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నాంపల్లి కోర్టుకు తరలించి 14ఏసీ ఎంఎం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అనంతరం వ్యక్తిగతపూచీకత్తుపై నాంపల్లి కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది.
ఈ పరిణామం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ ఘటనకు సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక మహిళని కూడా చూడకుండా పోలీసులు ఆ విధంగా వ్యవహరించడాన్ని గవర్నర్ తమిళిసై సహా పలువురు రాజకీయ నాయకులు ఖండించారు. తాజాాగా ప్రధాని మోడీ కూడా షర్మిలకు ఫోన్ చేసి పరామర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడినట్లు తెలుస్తొంది. ఈ సందర్భంలో తమని ఒక సారి కలవాలని షర్మిల కోరగా, ఢిల్లీకి రావాల్సిందిగా మోడీ ఆహ్వానించారని సమాచారం.