తెలంగాణలో కుటుంబ పాలన పోయి బీజేపీ పాలన వస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. రామగుండం ఎరువుల ప్యాక్టరీ జాతికి అంకితం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పర్యటనకు విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బేగంపేట విమానాశ్రయం వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళి సై, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బీజేపీ స్వాగత సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఒక భరోసా ఇచ్చారన్నారు. ఒక్క అసెంబ్లీ సీటు కోసం తెలంగాణ సర్కార్ మొత్తం మునుగోడు వెళ్లిందన్నారు. తెలంగాణలో అంధకారం ఎక్కువ రోజులు ఉండదనీ, కమలం వికసిస్తుందని అన్నారు. తెలంగాణ బీజేపీ కార్యకర్తలను చూసి తాను ఎంతో స్పూర్తి పొందానని పేర్కొన్నారు. ఇక్కడి పార్టీ శ్రేణులు బలమైన శక్తులనీ, ఎవరికీ భయపడరని మోడీ కొనియాడారు.
వామపక్షాల నేతలు అభివృద్ధి, సామాజిక న్యాయానికి వ్యతిరేకులనీ, అలాంటి వారితో టీఆర్ఎస్ సర్కార్ చేతులు కలిపిందని మోడీ విమర్శించారు. గతంలో పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యంలోనూ అక్రమాలు జరిగాయన్నారు. ఇప్పుడు ఆధార్ లింక్ చేయడం చేయడం ద్వారా అక్రమ బియ్యం రవాణాకు అడ్డుకట్ట పడిందన్నారు. ప్రజలను లూటీ చేసే వాళ్లు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పేదలకు అందాల్సిన నిధుల్లో అవినీతికి తావు లేకుండా చేశామని చెప్పారు. పీఎం కిసాన్ నిధులు నేరుగా రైతుల ఖాతాలో వేస్తున్నామని తెలిపారు. ఆధార్, మొబైల్, యూపీఐ వంటి సేవలతో అవినీతి లేకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నామనీ, నేరుగా ప్రజలకే ఇస్తుండటంతో అవినీతి పరులకు కడుపు మండుతోందని అన్నారు.
అవినీతి, కుటుంబ పాలన ప్రజాస్వామ్యానికి తొలి శత్రువులు అని మోడీ అన్నారు. ప్రధాని ఆవాస్ యోజన పథకాన్ని టీఆర్ఎస్ సర్కార్ నిర్వీర్యం చేసిందని విమర్సించారు. తెలంగాణను అవినీతి, కుటుంబ పాలన నుండి రక్షించడమే తమ లక్ష్యమని చెప్పారు. అవినీతిని సహించనందునే కొందరు తనను తిడుతున్నారనీ, వాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీని ఎంత తిట్టినా ఫరవాలేదు కానీ ప్రజల జోలికి వస్తే సహించేది లేదని, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజలను మోసం చేస్తుందని దుయ్యబట్టారు. అనంతరం ప్రధాని మోడీ రామగుండంకు బయలుదేరారు.