Gold Smuggling: ఎయిర్ పోర్టుల్లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నా విదేశాల నుండి బంగారం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు విస్తృతంగా తనిఖీ చేస్తుండటంతో కొందరు దుబాయి నుండి గన్నవరం (విజయవాడ) ఎయిర్ పోర్టు లో దిగి కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి బయటకు వస్తూ రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు తరలిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల సరిహద్దుల వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఆదివారం నాడు అక్రమంగా తరలిస్తున్న మూడున్నర కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడ నుండి హైదరాబాద్ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురి నుండి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సుల్తానా, షరీఫ్, జూవేద్ లుగా గుర్తించారు. వీరు దుబాయి నుండి గన్నవరం ఎయిర్ పోర్టులో విమానం దిగి రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు కారులో బయలుదేరారు. బంగారాన్ని లోదుస్తుల్లో పెట్టుకుని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పినా ఇక్కడ చెక్ పోస్టు వద్ద పోలీసుల నుండి తప్పించుకోలేకపోయారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బంగారాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.