Telangana Elections: ఏకాదశి, మంచి రోజు కావడంతో తెలంగాణలో గురువారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో గురువారమే ఎక్కువ మంది వివిధ పార్టీలోని ప్రముఖ నేతలు తమ నామినేషన్లు దాఖలు చేశారు. వందల సంఖ్యలో కార్యకర్తలు అభిమానులతో అభ్యర్ధులు ర్యాలీగా వచ్చి నామినేషన్లు దాఖలు చేయడంతో రాష్ట్రంలోని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలన్నీ సందడిగా మారాయి. నామినేషన్ల సందర్భంగా నాయకులు ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ రెండు చోట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఉదయం గజ్వేల్, మధ్యాహ్నం కామారెడ్డిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు కేసిఆర్. మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో, కేటిఆర్ సిరిసిల్లలో నేతలు, కార్యకర్తలతో వెళ్లి నామినేషన్లు సమర్పించారు. పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. మంచిర్యాలలో కాంగ్రెస్ తరపున సీనియర్ నేత ప్రేమ్సాగర్ రావు దాఖలు చేశారు.
బోధన్లో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ నామినేషన్ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధిరలో, మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటలో, సనత్నగర్ స్థానం నుండి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, పటాన్చెరు బీఆర్ఎస్ అభ్యర్ధి గూడెం మహిపాల్ రెడ్డి, ఎల్బీ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి, నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
అంబర్పేట బీజేపీ అభ్యర్ధి మాజీ మంత్రి కృష్ణ యాదవ్ నామినేషన్ దాఖలు చేయగా, ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పాల్గొన్నారు. ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి, ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ వెంకటస్వామి, బీఆర్ఎస్ అభ్యర్ధి బాల్క సుమన్, కూకట్పల్లి జనసేన అభ్యర్ధి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి నామినేషన్ లు దాఖలు చేశారు.