TRS: గత కొద్ది కాలంగా తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలోపేతం అవుతుండటంతో అధికార టీఅర్ఎస్ కొంత మేర ప్రజల్లో అసంతృప్తి నెలకొందని వార్తలు వచ్చాయి. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా ఉప ఎన్నికలు జరిగితే అక్కడి ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా వస్తుంటాయి. కానీ తెలంగాణలో దుబ్బాక, హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాజయం పాలైంది. అక్కడి బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఒక్క సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాల నుండి 45కిపైగా స్థానాలకు ఎగబాకింది. అధికార టీఆర్ఎస్ పై ఓ పక్క బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మరో పక్క పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముప్పెట దాడి చేస్తున్నారు. ఈ తరుణంలో రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని సుస్థిరపర్చుకోవాలంటే రాజకీయ వ్యూహకర్త అవసరమని టీఆర్ఎస్ భావించింది.
TRS: ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగిన రెండు రోజుల్లోనే..
వాస్తవానికి సీఎం కేసిఆర్ యే మాటల మాంత్రికుడుగా పేరుంది. మాటలతోనే ప్రజలను మెస్మరైజ్ చేయగలరు. సెంటిమెంట్ ను రగిల్చి దాన్ని ఓట్ల రూపంలో మర్చుకోగల కేపాసిటీ ఆయనకు ఉంది అంటారు. అయితే ఈ సారి బీజేపీ వ్యతిరేక కూటమి కట్టి జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రంతిప్పాలని కేసిఆర్ భావిస్తున్నారు. ఈ కారణంగా అటు జాతీయ స్థాయిలోనూ, ఇటు రాష్ట్రంలోనూ బీజేపీకి చెక్ పెట్టడానికి ఉద్దండ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) నియమించుకున్నారన్న వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ప్రశాంత్ కిషోర్ రాష్ట్రానికి చేరుకుని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగిన రెండు మూడు రోజుల వ్యవధిలోనే ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసు వెలుగులోకి రావడం, ఆ కేసులో కొందరిని అరెస్టు చేయడం చకచెకా జరిగిపోయాయి. ఈ కేసులో బీజేపీ మాజీ ఎంపి జీతేందర్ రెడ్డి, మాజీ మంత్రి డీకె అరుణలపైనా అనుమానాలు ఉన్నాయనీ, వారి ప్రమేయంపైనా విచారణ జరుపుతామని సైబరాబాద్ సీపీ పేర్కొనడం తెలిసిందే.
TRS: ఉత్తరాదిలో చెల్లుతాయేమో కానీ తెలంగాణలో..
అయితే ఈ ఆరోపణలను డీకే అరుణ కొట్టిపారేస్తున్నారు. ఇదంతా పీకే పొలిటికల్ స్ట్రాటజీగా ఆమె ఆరోపిస్తున్నారు. పీకే ఎక్కడ వ్యూహకర్తగా పని చేసినా అక్కడ సెంటిమెంట్ డ్రామా వర్క్ అవుట్ అయ్యేలా ప్లాన్ చేస్తుంటారనీ, ఇదీ అందులో భాగమేనని అంటున్నారు. ఇలాంటి వ్యూహాలు ఎక్కడో ఉత్తరాదిలో చెల్లుతాయేమో కానీ తెలంగాణలో చెల్లవని డీకే అరుణ అంటున్నారు. శ్రీనివాస్ గౌడ్ ఎపిసోడ్ తో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. దీని వెనుక పీకే స్ట్రాటజీ ఉందో లేదో తెలియదు కానీ బీజేపీ నేతలు మాత్రం ఆ విధంగా ఆరోపణలు చేస్తున్నారు. సో.. ప్రస్తుతం తెలంగాణలో పరిణామాలు గమనిస్తే ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగినట్లు స్పష్టం అవుతోందని అంటున్నారు. ఆయన టీమ్ ఇప్పటికే టీఆర్ఎస్ కోసం తమ వర్క్ ప్రారంభించిందని అంటున్నారు.