గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆ ఇద్దరు కీలక నేతలు ఏ పార్టీలో చేరతారు అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. ఈ ఇద్దరు నేతలు కూడా తమ మనసులో మాట ఎవరికీ చెప్పకుండా ఏ పార్టీ నాయకులు వచ్చినా వారితో మాట్లాడుతూ వస్తున్నారే తప్ప పార్టీలో చేరతామంటూ హామీ ఇవ్వకుండా కాలక్షేపం చేస్తూ వచ్చారు. ఒకరు నాగర్ కర్నూలు జిల్లాలో, మరొకరు ఖమ్మం జిల్లాలో మంచి పట్టు ఉన్న నేతలు కావడం, పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధుల గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో క్యాడర్ ఉన్న నాయకులు కావడంతో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీతో పాటు వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా వారిని పార్టీలో చేర్చుకునేందుకు ఆహ్వానించాయి. అయితే వీరి చూపు అంతా జాతీయ పార్టీల వైపే ఉంది. టీఆర్ఎస్ నుండి బహిష్కరణకు గురైన తర్వాత వీరు రెండు జాతీయ పార్టీల నేతలతో చర్చలు జరిపారు కానీ ఎవరికీ హామీ అయితే ఇవ్వలేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ పరిణామాల బట్టి పార్టీలో చేరికపై ఒక నిర్ణయం తీసుకోవాలని భావించారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు.

తొలుత వీరు బీజేపీ వైపు మొగ్గు చూపారు. అయితే కర్ణాటకలో బీజేపీ ఘోర ఓటమి పాలవ్వడంతో పాటు కేసిఆర్ విషయంలో కేంద్రంలోని బీజేపీ గట్టిగా స్పందించకపోవడంతో కొంత అనుమానాలకు ఆస్కారం కల్గింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ, సీబీఐ విచారణ జరపడం, చార్జి షీటులో ఆమె పేరను ప్రస్తావించడం తెలిసిందే. ఈ కేసులో అరెస్టు అయిన ఓ నిందితుడు కవితకు బినామీ అంటూ కూడా వార్తలు వచ్చాయి. రేపో మాపో అరెస్టు అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏమిజరిగిందో ఏమో కానీ కవిత వ్యవహారం మరుగున పడింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో రాకుండా అడ్డుకునేందుకు అవసరం అయితే బీజేపీ .. బీఆర్ఎస్ కు సహకరిస్తుంది అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. గల్లీలో కుస్తీ .. ఢిల్లీలో దోస్తీ అన్న తీరులో ఉందనే మాట వల్లనే బీజేపీలో చేరికలు ఆగిపోయాయంటూ ఆ పార్టీకి చెందిన ఓ నేతే వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నుండి బహిష్కరణకు గురైన శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఇద్దరూ అవసరమైతే ఆ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇచ్చే బీజేపీ వైపు వెళ్లడానికి ఇష్టపడటం లేదని అంటున్నారు.
వీటన్నింటికి తోడు ఆయా జిల్లాలోని వారి క్యాడర్ కూడా బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీయే బెటరు అని కూడా నేతలకు చెప్పినట్లు సమాచారం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయంతో ఆ పార్టీ అధిష్టానం ఇక తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఆదే ఊటు, టెంపోతో తెలంగాణలోనూ అధికారంలోకి రావాలని వ్యూహాలను సిద్దం చేసుకుంటోంది. ఈ ఇద్దరు నేతలు బీజేపీలోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేశారు కాంగ్రెస్ అధిష్టానం నేతలు. జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరికకు దాదాపు ఖరారు అయినట్లు ఆయన అనుచరగణం చెబుతోంది. జూన్ 8వ తేదీ జూపల్లి కృష్ణారావుతో పాటు వనపర్తి జిల్లా నేతలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డితో పాటు మరి కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తొంది. మరో వైపు ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ లోనే చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది.
తొలుత పొంగులేటి, జూపల్లి ఇద్దరూ కేసిఆర్ వ్యతిరేక శక్తులతో కలిసి ఓ రాజకీయ పార్టీగా అవతరించి ఎన్నికల్లో పోటీ చేసి పది – పదిహేను సీట్లు కైవశం చేసుకోవాలనీ, తద్వారా కింగ్ మేకర్ గా ఉండవచ్చని చర్చలు సాగించారుట. అయితే ఆ ఆలోచనను మానుకున్నట్లు తెలుస్తొంది. సుదీర్ఘ చర్చల అనంతరం ఇద్దరూ కాంగ్రెస్ గూటికే చేరాలని నిర్ణయించుకున్నారని సమాచారం. జూపల్లి తన జిల్లాలోని అభిమానులు, సపోర్టర్స్ అభిప్రాయాలతో కాంగ్రెస్ లో చేరాలని తుది నిర్ణయం తీసుకున్నారు. జూపల్లి కాంగ్రెస్ లో చేరడం ఖాయమని ఆయన సన్నిహితులు, అనుచరులు బహిరంగంగానే పేర్కొంటున్నారు.
పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా జూన్ నెలాఖరులోగా తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్దం పుచ్చుకునే అవకాశం ఉందని అంటున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ ఖమ్మం లో జూన్ 20వ తేదీ జరగనున్నది. ఆ సభ అనంతరం పొంగులేటి, ఆయన అనుచరులు కాంగ్రెస్ లో చేరికపై ప్రకటన చేస్తారని తెలుస్తొంది. జూన్ నెలాఖరులోగా ఖమ్మంలో మరో బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్ ముఖ్య నేతల సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఢిల్లీ హైకోర్టులో మాజీ డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియాకు బిగ్ షాక్