Praveen Kumar: బీఎస్పీ నేతగా మారిన మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ అధికార టీఎస్ఎస్, బీజేపీలపై హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవల కాలం వరకూ కేవలం అధికార టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ గా విమర్శలు చేసినా ప్రవీణ్ కుమార్ తాజాగా బీజేపీపైనా విమర్శలు సంధించారు. రాష్ట్ర బీఎస్పీ సమన్వయకర్త గా ఉన్న ప్రవీణ్ కుమార్ సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. కరీంనగర్ లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బహుజన రాజ్యంలో బడుగులే పాలకులు అవుతారన్నారు. తెలంగాణ సీఎం కేసిఆర్ అసెంబ్లీ రద్దు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని వ్యాఖ్యానించారు.
Read More: Vijaya Shanthi: కేసిఆర్ సర్కార్ కు విజయశాంతి హెచ్చరిక ..! ఏ విషయంలో అంటే..?
బూతులు మాట్లాడే నేతలకు వర్శిటీలు ఇస్తున్నారంటూ మంత్రి మల్లారెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు ప్రవీణ్ కుమార్. కేంద్రంలోని బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్తో లోపాయికారీ ఒప్పందం చేసుకున్న బీజేపీ మొన్న దుబ్బాకలో, ఇప్పుడు హుజూరాబాద్ లో నాటకాలు ఆడుతోందని విమర్శించారు ప్రవీణ్ కుమార్. ఈటలకు బుద్ది చెప్పేందుకు రూ.100 కోట్ల ఖర్చు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే హుజూరాబాద్ డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు.
హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచినా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని అన్నారు. తన సభలకు అధికార పార్టీ కరెంటు తీసివేస్తోందనీ, తాము అధికారంలోకి వస్తే కేసిఆర్ ఫామ్ హౌస్ కు కరెంటు కట్ చేస్తామన్నారు, రాబోయేది బహుజన రాజ్యమేననీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలదే రాజ్యాధికారమని పేర్కొన్న ప్రవీణ్ కుమార్ ..ఇప్పటి వరకూ పాలకులు దోచుకున్న వేల కోట్ల డబ్బులను గల్లా పట్టి తీసుకొస్తామని వాటిని విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు ఖర్చు చేస్తామన్నారు. ప్రగతి భవన్ ను బహుజన భవన్ గా మారుస్తామన్నారు.