కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి రాజీనామా లేఖను అందజేశారు. స్పీకర్ ఫార్మాట్ లో ఇచ్చిన తన రాజీనామాను పోచారం వెంటనే ఆమోదించినట్లు రాజగోపాల్ రెడ్డి మీడియాకు తెలిపారు. రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అదే రోజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు.
మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేసినట్లు రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యేగా ఉన్న తనకు ముఖ్యమంత్రి కేసిఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించారనీ, తాను పదవి లో ఉన్నప్పటికీ మునుగోడు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని బాధపడ్డానని చెప్పారు. అందుకే పదవీ త్యాగం చేశానని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. ఇప్పుడు తాను అధికార పార్టీపై యుద్ధం చేస్తున్నాననీ, తన గెలుపు ఓటములను మునుగోడు ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో వచ్చే తీర్పుతో కేసిఆర్ కుటుంబ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి లభిస్తుందన్నారు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రకటించిన ధర్మ యుద్దమని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో ప్రజలే గెలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్.. తెలంగాణ ద్రోహుల పార్టీ అయిపోయిందని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఇదే సందర్భంలో తనతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది నేతలు టచ్ లో ఉన్నారని చెప్పారు.
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖ ఇచ్చిన వెంటనే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించడం విశేషం. రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించినట్లు స్పీకర్ కార్యాలయం ప్రకటించింది. దీంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. ఉప ఎన్నికకు అన్ని రాజకీయ పార్టీలు సన్నద్దం అవుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి ఈ నెల 21వ తేదీన బీజేపీలో చేరనున్నారు.