Revanth reddy: ఆదివాసీ దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇంద్రవల్లిలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని చెప్పవచ్చు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో కోలుకోలేని రీతిలో చతికలపడ్డ కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలు రేవంత్ నింపగలడు అన్న ఆశాభావాన్ని కల్గించారు. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిర్వహించిన మొట్టమొదటి బహిరంగ సభ కావడంతో దీనిపై అందరి చూపు పడింది. అయితే ఈ సభకు అంచనాలకు మించి జనాలు హజరుకావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
టీపీసీసీకి రేవంత్ ని ఎంపిక చేసి కాంగ్రెస్ అధిష్టానం మంచి నిర్ణయమే తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దళితులను దగ్గర చేర్చుకోవాలన్న ప్రయత్నంలో భాగంగా కేసిఆర్ సర్కార్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన తరుణంలోనే దానికి కౌంటర్ గా రేవంత్ రెడ్డి నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. రేవంత్ నింపిన జోష్ తో రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చారు. పార్టీకి చెందిన ప్రముఖ నేతలు అందరూ సభకు హజరైయ్యారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి, పీసీసీకి పోటీ పడి భంగపడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మినహా పార్టీకి చెందిన సీనియర్ నేతలు అందరూ కార్యక్రమానికి హజరైయారు. గత కొంత కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా కొండ సురేఖ కూడా పాల్గొని ఇంద్రవెల్లి చేరుకున్న రేవంత్ కు ఘన స్వాగతం పలికారు. సభా నిర్వహణ మొత్తం సీతక్క చూసుకున్నారు.
ఈ సభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం దళిత గిరిజనుల్లో ఆసక్తి రేపింది. సభకు వస్తున్న సామాన్య జనాన్ని కేసిఆర్ సర్కార్ ఎక్కడికక్కడ నిలిపేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసిఆర్ సర్కార్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులకు పెద్ద పీట వేసింది, వేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనంటూ పలు ఉదాహారణలు చెప్పారు రేవంత్. దళితులకు చట్టసభల్లో రిజర్వేషన్ తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని రేవంత్ గుర్తు చేశారు. కేసిఆర్ కు ఎన్నికలకు వస్తేనే దళితులు గుర్తుకు వస్తారని, కెసిఆర్ మంత్రివర్గంలో ఎస్సీలకు చోటే దక్కలేదని అన్నారు. రాష్ట్రం ఏర్పడితే దళితుడినే సీఎం చేస్తానని చెప్పిన కేసిఆర్ ఏమి చేశారని ప్రశ్నించారు. ఉప ఎన్నిక ఉందని హూజూరాబాద్ లో దళితులకు రూ.10లక్షలు అంటున్నారనీ, 118 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావాలని అప్పుడే అన్ని నియోజకవర్గాలకు దళిత బంధు వస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలో ఈ నెల 18న దళిత, గిరిజన దండోరా మోగిస్తామని రేవంత్ పేర్కొన్నారు.