Revanth Reddy: భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. ఆరోపణలు వచ్చిన వెంటనే సీఎం కేసిఆర్ వెంటనే స్పందించి వెంటనే విచారణకు ఆదేశించడం, ఆ మరుసటి రోజే మంత్రిత్వ శాఖ తొలగించడం, తదుపరి మంత్రివర్గం నుండి బర్తరఫ్ హుటాహుటిన జరిగిపోయాయి. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తుండగా కాంగ్రెస్ పార్టీ ఎంపి రేవంత్ రెడ్డి మరో వ్యవహారాన్ని బయట పెట్టి మరో ఇద్దరు మంత్రులను తొలగించాలని డిమాండ్ చేశారు.
గతంలో ఓ పర్యాయం కేసిఆర్ అసెంబ్లీ సాక్షిగా అవినీతి ఎక్కడ జరిగినా, ఎవరు చేసినా ఉపేక్షించేది లేదనీ అన్నారనీ, చివరకు తన కుమారుడు చేసినా శిక్షార్హుడేనని అన్నారనీ గుర్తు చేస్తూ కేసిఆర్ కు చిత్తశుద్ధి ఉంటే దేవరయాంజాల్ సీతారామస్వామి ఆలయ భూముల ఆక్రమణపై విచారణ జరిపించాలని కోరారు. ఆ ఆక్రమణల భూముల వ్యవహారంలో కేసిఆర్ కుటుంబం, సన్నిహితులకు హస్తం ఉందని ఆరోపించారు. నిషేదిత జాబితాలో ఉన్న 437 సర్వే నెంబర్ మంత్రి కేటిఆర్, ఓ పత్రిక సీఎండీ దామోదర్ రావు కు భూములు ఉన్నాయన్నారు. వాటికి సేల్ డీడ్ కాపీలను మీడియా ముందు బయటపెట్టారు.
ఒక ఎంపిగా ఆ భూమల వివరాలు అడిగితేనే ఇవ్వడం లేదనీ అన్నారు. 95 ఏళ్ల కు దేవరయాంజాల్ దేవాలయ భూముల వివరాలు బయటపెట్టాలని రేవంత్ డిమాండ్ చేస్తూ వాటిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వారి బండారం బయటపడుతుందనే వాటి రికార్డులు అడిగితే ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈటలను తొలగించినట్లుగానే మంత్రులు కేటిఆర్, మల్లారెడ్డి లను తొలగించాలని కోరారు. వారు మంత్రులుగా ఉంటే రికార్డులను తారు మారు చేయించే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. .రేవంత్ రెడ్డి చేసిన ఈ సంచలన ఆరోపణలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. రేవంత్ చేసిన ఆరోపణలపై కేసిఆర్ ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.