Revanth Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా నియమితులైన తరువాత రేవంత్ రెడ్డి పార్టీ క్యాడర్ లో ఓ జోష్ నింపారు. సీనియర్ నేతలు కొందరు సహకరించకపోయినా రేవంత్ రెడ్డి తన దైన శైలిలో పలువురు నేతలను కలుస్తూ కార్యక్రమాలను రూపొందించారు. పలు జిల్లాల్లో సభలు నిర్వహించి పార్టీ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపారు. దీంతో రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తుపై ఆ పార్టీ సానుభూతిపరులకు ఆశలు చిగురించాయి. దీంతో వివిధ పార్టీల్లోని నేతలు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ చేరికలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ నుండి ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు అత్యధికులు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోగా, కొందరు మాత్రం బీజేపీలో చేరారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యే వరకూ కాంగ్రెస్ పార్టీలో పెద్దగా చేరికలు ప్రారంభం కాలేదు. అయితే హూజూరాబాద్ ఉప ఎన్నికల ముందు వరకూ స్పీడ్ గా రాజకీయం చేసిన రేవంత్ రెడ్డి అక్కడి ఎన్నికల్లో సమర్ధవంతమైన నేతను పోటీకి పెట్టకపోవడంతో ఈటలతో మాచ్ ఫిక్సింగ్ అయ్యారన్న ఆరోపణలు వచ్చాయి.
Revanth Reddy: పోటీ పెట్టి పరువు పొగొట్టుకున్నట్లు అయ్యిందిగా
స్థానికులు ధరఖాస్తు చేసినా వారికి టికెట్ కేటాయించకుండా నాన్ లోకల్ అభ్యర్ధిని పోటీలో పెట్టడంతో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ కూడా ఈటలకు పడేలా చేశారన్న ఆరోపణ ఉంది. అందుకే హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ఈటల రాజేందర్ రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నిక కావడంతో కేసిఆర్, ఈటల తేల్చుకుంటారనీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకుండా ఉన్నా పరువు దక్కేదనీ, ఇప్పుడు పోటీకి పెట్టి పరువు పొగొట్టుకున్నట్లు అయ్యిందన్న మాట వినబడుతోంది. పార్టీలోని సీనియర్లు సైతం దీనిపై బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధిష్టానం కూడా దీనిపై వివరణ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అపవిత్రపొత్త పెట్టుకున్నాయంటూ టీఆర్ఎస్ విమర్శించింది. ఇది ఇలా ఉంటే రేవంత్ రెడ్డి పీసీసీ అయిన తరువాత మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడైన డీ శ్రీనివాస్ లు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. వీరితో రేవంత్ రెడ్డి భేటీ అయి పార్టీలోకి ఆహ్వానించారు.
డీఎస్, కొండా దారి ఎటో..?
అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు ఈటల రాజేందర్ తో సన్నిహితంగా మెలుగుతున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే ఈటల గెలుపు కోసం తీవ్రంగానే కృషి చేశారు. ఆయన వెనకే కొండా ఉంటున్నారు. తాజాగా డీఎస్ కూడా ఈటలను కలిశారు. డీఎస్ ప్రస్తుతం టీఆర్ఎస్ కు దూరంగానే ఉన్నారు. ఆ పార్టీ కూడా ఆయనను పక్కన పెట్టింది. డీఎస్ పెద్ద కుమారుడు అరవింగ్ బీజేపీ ఎంపిగా ఉండగా, రెండవ కుమారుడు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రస్తుతం ఈటలతో సన్నిహితంగా ఉన్నప్పటికీ ఏ పార్టీలో లేరు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే డీ శ్రీనివాస్, కొండా విశ్వేశ్వరరెడ్డిలు రేవంత్ రెడ్డికి హాండ్ ఇచ్చి బీజేపీ వైపు చూస్తున్నారేమో అన్న టాక్ కూడా నడుస్తోంది. వీరి వ్యవహారంపై కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.