సంక్రాంతి పండుగ సీజన్ వచ్చింది అంటే వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు అందరూ సొంతూళ్లకు పయనం అవుతుంటారు. సంక్రాంతి పండుగ వేళ ఆర్టీసీ కూడా 50 శాతం అదనపు చార్జీలతో ప్రత్యేక బస్సు సర్వీసులను వివిధ ప్రాంతాలకు నడుపుతూ ఉంటుంది. అదే మాదిరిగా వందలాది ప్రైవేటు వాహనాలు జాతీయ రహదారులపై రుయ్ రుయ్ మంటూ దూసుకు పోతుంటాయి. ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో పలు ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు బస్సును నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారు. అదనపు చార్జీలు వసూలు చేయడంతో పాటు ఓవర్ లోడ్ (సీటింగ్ కెపాసిటీకి మించి) ప్రయాణీకులను ఎక్కించుకుని వెళుతుంటాయి.
ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై తెలంగాణ ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపించారు. మంగళవారం వేకువజామున హైదరాబాదు శివారు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. బస్సులను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఎల్బీనగర్ వద్ద, పెద్ద అంబర్ పేట ఓటర్ రింగ్ రోడ్డు వద్ద, బెంగళూరు హైవే మార్గంలో తొండుపల్లి 44వ జాతీయ రహదారిపై శంషాబాద్ మున్సిపల్ పరిధిలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆర్ టీ ఏ అధికారులు తనిఖీ చేశారు.
ఎల్బీనగర్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న మూడు బస్సులను అధికారులు సీజ్ చేయడంతో పాటు మరో ఆరు బస్సులపై కేసులు నమోదు చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు పండుగ సందర్భంగా ప్రయాణీకుల నుండి అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ టీ ఏ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రవేటు ట్రావెల్స్ బస్సులలో ప్రయాణీకులతో పాటు లగేజీ ని కూడా రవాణా చేస్తున్న బస్సులపై చర్యలు తీసుకుంటామని ఆర్టీఏ అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నడిచే ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల వల్ల తరచు ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.