సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణీకుల నుండి అధిక ధరలు వసూలు చేయవద్దని ఆర్టీఏ అధికారులు ఆదేశాలు జారీ చేసినా కొందరు ప్రైవేటు ట్రావెల్స్ నిర్వహకులు ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. నిబంధనలు పాటించకుండా, అధిక ధరలకు టికెట్లు విక్రయించే ట్రావెల్స్ పై తెలంగాణ రవాణా శాఖ కొరడా జులిపించింది. సంక్రాంతి పండుగ వస్తుందంటే వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు స్వగ్రామాలకు చేరుతుంటారు. ప్రయాణీకుల రద్దీ పెరగడంతో ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు అధిక ధరలు వసూలు చేస్తుంటారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బస్సులు, రైళ్లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి. సొంత ఊళ్లకు వెళ్లే వాళ్లతో బస్టాండ్ లు, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది.

ఈ నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీని అరికట్టేందుకు రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భాగంగా హైదరాబాద్ వనస్థలిపురం వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్ టీ ఏ అధికారులు దాడులు నిర్వహించి తనిఖీలు చేశారు. పది బస్సులపై కేసులు నమోదు చేసిన ఆర్ టీ ఏ అధికారులు, రెండు బస్సులను సీజ్ చేశారు.