Sagar by poll : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వేళ బీజేపీ, టీఆర్ఎస్ వ్యూహాత్మక అడుగులు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్ని రాజకీయ పార్టీల కంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించిన విషయం తెలిసిందే. సీనియర్ నేత, మాజీ మంత్రి కే జానారెడ్డి ని ఖరారు చేయగా ఆయన ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఇక అధికార టీఆర్ఎస్, బీజేపీ లు ఒకరికి ఒకరు.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తరువాత అన్నట్లుగా వేచి చూశాయి. 30వ తేదీ (మంగళవారం) నామినేషన్ ల స్వీకరణకు ఆఖరు తేదీ కావడంతో ముందుగా బీజేపీ.. నియోజక వర్గ ఇంచార్జి నివేదిత రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్టు లీకులు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఆన్ రిజర్వడ్ నియోజకవర్గం అయిన సాగర్ లో బీసీ సామాజిక వర్గానికి చెందిన దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య కుమారుడు భగత్ కుమార్ ను టీఆర్ఎస్ ప్రకటించింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థి భగత్ కుమార్ కు బీ ఫాం తో పాటు ప్రచార ఖర్చుకు చెక్ అందజేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి ని డీక్లేర్ చేసిన తరువాత బీజేపీ అనూహ్యంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ప్రభుత్వ వైద్యధికారి పొనుగోతు రవి కుమార్ ను అభ్యర్థిగా ప్రకటించి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. నిన్నటి వరకు నివేదిత రెడ్డి, లేదా కడారి అంజయ్య యాదవ్ కి టికెట్ ఖరారు అవుతుందని పార్టీ నేతలు భావించారు. నాయకుల అంచనాలకు భిన్నంగా ఊహించని నేత పేరును తెరపైకి తీసుకొని వచ్చింది
బీజేపీ. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు నియోజకవర్గంలో ప్రధాన ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేసినట్లు స్పష్టం అవుతోంది. ఈ నియోజకవర్గంలో బీసీ సామాజిక ఓట్లు అధికం. దాదాపు లక్ష ఓట్ల వరకు బీసీ ఓట్లు ఉండగా అందులో యాదవ సామాజిక వర్గ ఓట్లు సుమారు 34వేలకు పైగా ఉన్నాయి. ఆ తరువాత స్థానాల్లో ఎస్టీ, రెడ్లు ఉన్నారు. నియోజకవర్గంలో ఎస్టీ ఓట్లు 40 వేలకు పైగా ఉన్నట్టు అంచనా. వీటిలో దాదాపు 38వేల ఓట్లు లంబాడి సామాజిక వర్గీయులు ఉండటం గమనార్హం. ఇక రెడ్డి సామాజిక వర్గ ఓట్లు 23వేల ఓట్లు ఉన్నాయి.
సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య అకాల మృతి తో ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 17వ తేదీన జరుగుతోంది. మే 2వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరుగనుంది.