Sai Dharam Tej: సిినీ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్న అపోలో ఆసుపత్రి వైద్యులు సాయి తేజ్ శరీరంలో అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాలేదనీ, కాలర్ బోన్ విరిగిందని నిన్న పేర్కొన్నారు. ఆయనకు కాలర్ బోన్ సర్జరీ చేయనున్నట్లు ప్రకటించిన వైద్యలు కొద్ది సేపటి క్రితం సర్జరీ పూర్తి చేశారు. మరో 24 గంటలు వెంటిలేటర్ పైనే సాయి తేజ్ కి ట్రీట్మెంట్ అందించనున్నారు.
మొన్న రాత్రి స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తూ సాయి తేజ్ కేబుల్ బ్రిడ్జ్ దాటిన తరువాత కోహినూర్ హోటల్ సమీపంలో బైక్ స్కిడ్ అయి పడిపోవడంతో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి తేజ్ అపస్మారక స్థితికి చేరుకోవడంతో తొలుత సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాద విషయం తెలియడంతోనే సాయి తేజ్ మేనమామలు చిరు, పవన్ కల్యాణ్ తదితర కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని సాయితేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.