Sai Dharam Tej road Accident: మెగా బ్రదర్స్ మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్ నిన్న రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై పలువురు టాలివుడ్ పెద్దలు, సీనియర్, జూనియర్ హీరోలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. పలువురు పెద్దలు ఇప్పటికే ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆక్షాంక్షిస్తున్నారు. ఈ తరుణంలో మా అధ్యక్షుడు నరేష్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. నరేష్ స్పందనను నిర్మాత నట్టికుమార్ తప్పుబట్టారు. ఇలాంటి సందర్భంలో నరేష్ గారు రేసింగ్ గురించి మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయవద్దని నట్టికుమార్ నరేష్ ను కోరారు.
సాయి ధరమ్ తేజ్ ఆసుపత్రి నుండి కోలుకుని వచ్చి షూటింగ్స్ చేసుకుంటూ అందరితో మనలాగే ఉండాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నానని పేర్కొన్నారు నట్టికుమార్. అలాగే ఈ సందర్భంగా ఒ విషయం చెప్పదల్చుకున్నాననీ, ఇప్పుడు ఈ విషయంలో రాజకీయాలు చేయాలని చూడవద్దని సూచించారు. ఆయన క్షేమంగా బయటి రావాలని సినిమా తరపున అందరం ప్రార్థనలు చేద్దామన్నారు. నరేష్ గారు మాట్లాడింది తనకు నచ్చలేదన్నారు. నరేష్ గారు రేసింగ్ తీసుకురావడం కరెక్టు కాదన్నారు. ఆయన రేసింగ్ చేయట్లేదనీ, సాయి మామూలు డ్రస్ లో వెళుతున్నారన్నారు. సాయి ధరమ్ తేజ్ ఇంటి నుండి వెళుతున్నారనీ, దుర్గం చెరువు బ్రిడ్జ్ మీద నుండి వెళుతున్నారనీ, మీరు ఇంటి దగ్గర నుండి వచ్చారని చెబుతున్నది రాంగ్ అని అనిపిస్తోందన్నారు. సాయి తన ఇంటి వద్ద నుండి మీ ఇంటికి వస్తున్నట్లు ఉంది తప్ప మీ ఇంటి దగ్గర నుండి వెళుతున్నట్లు లేదన్నారు. దయచేసి రేసింగ్ అనే పాయింట్స్ ఇప్పుడు వద్దని సూచించారు. ఆయన వెళుతున్న స్పీడ్ కూడా తక్కువలోనే పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు అక్కడ ఇసుక ఉండటం వల్ల స్కిడ్ అయ్యారు తప్ప ఇంకోటి కాదన్నారు. దయచేసి ఈ విషయాలు ఇక్కడితో వదిలేసి ఆయన బాగుండాలని కోరుకుందాం తప్ప ఈ రేసింగ్ విషయాలు ఇప్పుడొద్దని హితవు పలికారు. సాయి, మీ అబ్బాయి స్నేహితులు కాబట్టి రేసింగ్ విషయాలను పక్కన పెట్టి సాయి తేజ్ గారు క్షేమంగా వచ్చి తిరిగి షూటింగ్స్ లో పాల్గొనాలని కోరుకుందామని అన్నారు.
ఇంతకూ నరేష్ ఏమన్నారు అంటే ..సాయి తేజ్, మా అబ్బాయి ఇద్దరూ స్నేహితులు, బ్రదర్స్ లా ఉంటారన్న నరేష్.. సాయి తన బిడ్లలాంటి వాడనీ, త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నానన్నారు. నిన్న సాయంత్రం వీళ్లిద్దరూ మా ఇంటి నుండే వెళ్లారనీ, వాళ్ల బైక్ సౌండ్ విని వేగంగా వెళ్లోద్దని చెబుదామని బయటకు వచ్చాననీ, అంతలోనే ఇద్దరూ వెళ్లిపోయారన్నారు. బైక్ లు వేగంగా నడపొద్దని నాలుగు రోజుల క్రితం వాళ్లకు కౌన్సిలింగ్ ఇద్దామని అనుకున్నానని నరేష్ పేర్కొన్నారు. ఇద్దరూ పెళ్లి కావలసిన వాళ్లు, మంచి వయసులో ఉన్న వాళ్లు ఇలాంటి వయసులో రిస్కులు తీసుకోకూడదని అన్నారు. అపోలో ఆసుపత్రికి వెళ్లి సాయిని పరామర్శించాలని ఉన్నా అక్కడి పరిస్థితులను బట్టి వెళ్లలేకపోయాననీ, త్వరలో వెళ్లి కలుస్తానన్నారు. సాయి పూర్తి ఆరోగ్యంతో ఇంటికి రావాలని కోరుకుంటున్నానని నరేశ్ పేర్కొన్నారు.
మరో పక్క సాయి తేజ్ రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బైక్ రేసుల కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తేజ్, నవీన్ విజయ కృష్ణ (నరేశ్ కుమారుడు), మరో వ్యక్తి ఒకే చోట నుండి బయలుదేరినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అసలు సాయి తేజ్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతున్నారన్న దానిపై ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించారు.