Sama Venkata Reddy Resigns TRS: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయో ఇంకా తెలియదు కానీ తెలంగాణ రాజకీయ వాతావరణం ఇప్పటి నుండి వేడెక్కుతోంది. టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు ప్రారంభం అయ్యాయి. ఇది ఊహించని పరిణామమే అని చెప్పవచ్చు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ నుండి నేతలు వేరే పార్టీలకు చేరడమే కానీ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నాయకులు చాలా తక్కువ. ఒక వేళ ఒకరో ఇద్దరో పార్టీలో చేరినా కొద్ది రోజుల్లోనే సొంత గూటికి వెళ్లిపోయారు. అయితే రేవంత్ రెడ్డి ఆపరేషన్ రివర్స్ ఆకర్ష్ తో గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వెళ్లిన నేతలు, గతంలో టీడీపీలో యాక్టివ్ గా ఉన్న నేతలు, టిఆర్ఎస్ లో అసంతృప్తి నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.
ఈ తరుణంలోనే కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేలా హుజారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి కౌశిక్ రెడ్డి నిన్న సీఎం కేసిఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే బలమైన యవనేత టీఆర్ఎస్ లో చేరుతున్నాడని ఆ పార్టీ సంతోషిస్తుండగా ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవనీయకుండా టీఆర్ఎస్ కు సీనియర్ నేత, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ సామ వెంకట రెడ్డి ఆ మండలి కార్యవర్గ సభ్యులందరితో కలిసి టీఆర్ఎస్ కు బైబై చెప్పి ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. పాడి కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ లో ఇన్ అయిన వేళ సీనియర్ నేత సామ వెంకట్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి ఊహించని షాక్యే.
టీఆర్ఎస్ నుండి బయటకు వెళ్లిన సామ వెంకట రెడ్డి పార్టీలో చిన్న స్థాయి నాయకుడు ఏమీ కాదు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి క్రియాశీలకంగా పని చేసిన నేత. అందుకే కేసిఆర్ ఆయనకు రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ పదవి ఇచ్చారు. సామ వెంకటరెడ్డి తన పదవిని వదిలివేయడంతో పాటు మండలి కార్యవర్గ సభ్యులతోనూ రాజీనామా చేయించి కాంగ్రెస్ పార్టీకి తీసుకువెళుతున్నారు. టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన వెంకట రెడ్డి ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ తో సమావేశమైయ్యారు. ఈ పరిణామాలు చూసిన వారు రేవంత్ వ్యూహం మామూలుగా లేదుగా అంటున్నారు.