తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా 1989 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన ఏ శాంతి కుమారి నియమితులైయ్యారు. శాంతి కుమారిని సీఎస్ గా నియమించాలని సీఎం కేసిఆర్ ఆదేశాల నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర మొదటి మహిళ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి బాధ్యతలు చేపట్టనున్నారు. తనకు సీఎస్ గా అవకాశం కల్పించినందుకు శాంతి కుమారి ప్రగతి భవన్ కు చేరుకుని సీఎం కేసిఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
శాంతి కుమారి ఎమ్మెల్సీ మెరైనా బయోలజీ చదివిన తర్వాత అమెరికాలో ఎంబీఏ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్ మెంట్, అటవీ శాఖల్లో ఐఏఎస్ గా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు. ఐక్య రాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండు సంవత్సరాల పాటు పని చేశారు. గతంలో నాలుగు సంవత్సరాల పాటు సీఎంఓలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఇపాస్ లో ఇండస్ట్రీ చేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా పని చేశారు. ప్రస్తుతం శాంతికుమారి అటవీశాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పని చేస్తున్నారు. సీఎస్ సోమేష్ కుమార్ ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుండి రిలీవ్ చేసి ఏపి కి పంపుతూ ఆదేశాల నేపథ్యంలో కేసిఆర్ సర్కార్ నూతన సీఎంగా శాంతి కుమారికి అవకాశం కల్పించింది.
కాగా ఏపి ప్రభుత్వంలో రేపు (12వ తేదీ) సోమేష్ కుమార్ జాయిన్ కావాల్సి ఉంది. అయితే ఏపికి వస్తే సీఎస్ గా నియమించే అవకాశం లేనందున సోమేష్ కుమార్ విఆర్ఎస్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తొంది. ఆయన వీఆర్ఎస్ తీసుకున్న వెంటనే కేసిఆర్ సర్కార్ లో ప్రభుత్వ సలహాదారుగా నియమితులు అవుతారని ప్రచారం జరుగుతోంది.