Disha Encounter Case: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 2019 లో జరిగిన దిశ ఎన్ కౌంటర్ పచ్చి బూటకమని సుప్రీం కోర్టు నియమించిన సిర్పూర్కర్ కమిషన్ తేల్చింది. చట్టపరమైన నిబంధనలు, పోలీస్ మాన్యువల్ నిబంధనలు అతిక్రమించి ఎన్ కౌంటర్ కు పాల్పడ్డారనీ, దిశ ఎన్ కౌంటర్ బూటకమని, పోలీసులే కావాలని వారిని కాల్చి చంపారని పేర్కొంది. ఈ మేరకు 387 పేజీల రిపోర్టును సుప్రీం కోర్టుకు కమిషన్ సమర్పించింది. నిందితుల్లో ముగ్గురు మైనర్లు అన్న విషయాన్ని పోలీసులు దాచారని నివేదికలో వెల్లడించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Disha Encounter Case: వారిపై హత్య కేసు పెట్టి విచారించాలి
ఈ నకిలీ ఎన్ కౌంటర్ కు పాల్పడిన పది మంది పోలీసులు సురేందర్, నర్శింహరెడ్డి, షేక్ లాల్, మహ్మద్ సిరాజుద్దీన్, కొ్చ్చర్ల రవి, వెంకటేశ్వర్లు, అరవింద్ గౌడ్, జానకి రామ్, బాలు రాథోడ్, డి శ్రీకాంత్ లపై 302 సెక్షన్ కింద కేసు పెట్టి విచారణ చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది. మీడియాకు, కమిషన్ కు పోలీసులు కట్టుకథలు చెప్పారని పేర్కొంది. కాగా దిశ ఎన్ కౌంటర్ కేసును తెలంగాణ హైకోర్టుకు సుప్రీం కోర్టు బదిలీ చేస్తూ అభ్యంతరాలను హైకోర్టుకు తెలపాలని సూచించింది.
2019 నవంబర్ 27న ఘటన
అసలు ఏమి జరిగింది అంటే.. 2019 నవంబర్ 27న సాయంత్రం ఇంట్లో నుండి ఆసుపత్రికి వెళ్లిన యువ వైద్యురాలు దిశ ఆచూకి లేకుండా పోయింది. తల్లిదండ్రులు అదే రోజు రాత్రి శంషాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే మరుసటి రోజు ఉదయం చటాన్ పల్లి వద్ద జాతీయ రహదారి వంతెన కింద కాలుతున్న ఓ యువతి మృతదేహాన్ని గుర్తించారు. మృతురాలు దిశగా గుర్తించిన పోలీసులు పూర్తి వివరాలు సేకరించారు. మహబూబ్ నగర్ జిల్లా ముక్తల్ మండలానికి చెందిన చెన్నకేశవులు, అరిప్, శివ, నవీన్ లు హత్యాచారానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించి వారిని అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చారు. మెజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు వారిని రిమాండ్ కు తరలించగా కోర్టు అనుమతితో విచారణకు 2019 డిసెంబర్ 4న పోలీస్ కస్టడీకి తీసుకున్నారు.
2019 డిసెంబర్ 6న ఎన్ కౌంటర్
డిసెంబర్ 6న దిశ వస్తువులు ఎక్కడ దాచారో తెలుసుకునేందుకు నిందితులు నలుగురిని పోలీసులు ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. ఆ సమయంలో నిందితులు పోలీసుల వద్ద నుండి తుపాకులు లాక్కొని పరారు అయ్యే ప్రయత్నం చేయడంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు నిందితులు మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. అయితే ఎన్ కౌంటర్ జరిగిన తీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ సామాజిక కార్యకర్తలు, మానవహక్కుల సంఘాలు హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టులోనూ పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు డిసెంబర్ 12న సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సిర్పూర్కర్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. కమిషన్ విచారణ నివేదికను సుప్రీం కోర్టుకు అందజేసింది.