తెలంగాణ సర్కార్ కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పై ఎన్జీటీ విధించిన రూ.500 కోట్ల జరిమానాపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఎన్జీటీ జరిమానా విధిస్తూ ఇచ్చిన తీర్పును తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఇవేళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీల వరకు పని కొనసాగించుకునేందుకు మాత్రమే ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని స్పష్టం చేసింది.
తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవద్దని, ప్రజలకు ఇబ్బందులకు గురి కాకూడదన్న ఉద్దేశంతోనే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్ లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో మెరిట్స్ ఆధారంగానే తగిన నిర్ణయాలు ఉంటాయని కోర్టు పేర్కొంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) విధించిన రూ.500 కోట్ల జరిమానాపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా ప్రతివాదనలు అందరూ కౌంటర్ అఫిడవిట్ లు దాఖలు చేయాలనీ, ఆ తర్వాత ఆరు వారాల్లోగా వాటికి సమాధానంగా రీజాయిండర్లు దాఖలు చేయాలని పిటిషన్ ను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టులో చేపట్టనున్నట్లు తెలిపింది.
MLAs poaching case: సుప్రీం కోర్టులో తెలంగాణ సర్కార్కు లభించని ఊరట.. విచారణ 27వ తేదీకి వాయిదా