తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు ఎక్కనున్నది. తెలుగు రాష్ట్రాల మధ్య మూడు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని గతంలోనే నిర్ణయించుకున్న రైల్వే శాఖ..అందులో మొదటగా సికింద్రాబాద్ – విశాఖ మధ్య వందేభారత్ రైలును ఇటీవల ప్రవేశపెట్టింది. ఆ రైలుకు ప్రయాణీకుల నుండి అత్యంత ఆదరణ లభిస్తొంది. రోజు వంద శాతం ఆక్యుపెన్సీ సాధిస్తొంది. దీంతో రెండో వందేభారత్ రైలును సికింద్రాబాద్ – తిరుపతి మధ్య నడిపేందుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రైలు ప్రారంభోత్సవానికి మూహూర్తం ఫిక్స్ అయినట్లు గా తెలుస్తొంది.

సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వందేభారత్ కొత్త సర్వీను ఏప్రిల్ 8వ తేదీన ప్రారంభం కానున్నది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఆ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ఖరారు అయ్యింది. అదే రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులకు కూడా ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తొంది. కాగా ఇప్పటికే సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వందేభారత్ ట్రైన్ ట్రయిల్ రన్ పూర్తి చేశారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న మూడు మార్గాల్లో ఏ రూట్ ను ఖరారు చేయాలనే దానిపై అధ్యయనం చేశారు.
ప్రస్తుతం సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్లే ఇతర రైళ్లలో ప్రయాణీకులకు దాదాపు 12 గంటల సమయం పడుతోంది. అదే వందేభారత్ అందుబాటులోకి రావడం ద్వారా కేవలం ఆరు నుండి ఏడు గంటల సమయంలోనే గమ్యస్థానానికి చేరుకునే అవకాశం లభిస్తుంది. సికింద్రాబాద్ నుండి తిరుపతికి మూడు మార్గాలను అధ్యయనం చేసిన అధికారులు ప్రస్తుతం నారాయణాద్రి నడుస్తున్న మార్గంలోనే ఈ వందేభారత్ రైలును నడపాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తొంది. దీంతో సికింద్రాబాద్, బీబీనగర్, నల్లొండ, గుంటూరు, తెనాలి, నెల్లూరు, గూడూరు, కాళహస్తి మీదుగా తిరుపతికి నడపాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తొంది.