ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈ రోజు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు విచారించనున్న సంగతి తెలిసిందే. ఈ రోజు 11 గంటలకు సీబీఐ అధికారులు కవిత నివాసానికి చేరుకుని లిక్కర్ స్కామ్ నకు సంబంధించి వారి వద్ద ఉన్న సందేహాలపై ప్రశ్నలను సంధించి సమాధానాలను రికార్డు చేయనున్నారు. సీబీఐ అధికారుల విచారణ నేపథ్యంలో కవిత నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కవిత నివాసం సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి ఇతరుల ప్రవేశాలను అనుమతించడం లేదు. టీఆర్ఎస్ కార్యకర్తలు అనవసరంగా అక్కడ గుమిగూడవద్దని, దర్యాప్తు ఏజన్సీకి సహకరించాలని ఇప్పటికే పార్టీ నాయకత్వం సూచించినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో ఉదయం 11 గంటల నుండి సిబీఐ అధికారులు ఆమెను విచారించన్నారు.
సీబీఐ అధికారుల విచారణకు ఒక్క రోజు ముందు కవిత ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా ఫ్లేక్సీలు వెలిశాయి. ఆ ఫ్లెక్సీల్లో కవితకు మద్దుతగా డాటర్ ఆఫ్ ఫైటర్.. విల్ నెవర్ ఫియర్.. వీ ఆర్ విత్ కవితక్క అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ముందుగా సీబీఐ అధికారులు ఈ నెల 6వ తేదీన కవితను విచారించాలని నోటీసులు జారీ చేశారు. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల 6వ తేదీ విచారణకు అందుబాటులో ఉండనని, 11 నుండి 15వ తేదీ లోపు 13వ తేదీ మినహా ఏ రోజునైనా తాను అందుబాటులో ఉంటానని కవిత సీబీఐ అధికారులకు లేఖ రాశారు. కవిత లేఖపై 11వ తేదీ (నేడు) ఉదయం 11 గంటలకు విచారణకు సీబీఐ అధికారి అంగీకారం తెలియజేస్తూ మెయిల్ ద్వారా ప్రత్యుత్తరం ఇచ్చారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి ఎఫ్ఐఆర్ లో కవిత పేరు లేకపోయినా తొలుత బీజేపీ నేతలు ఆమెపై ఆరోపణలు చేశారు. అయితే ఈ కేసులో ఢిల్లీ వ్యాపారి అమిత్ అరోరాను ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో కవిత వివరణను సీబీఐ అధికారులు తీసుకోనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీబీఐ అధికారులు ఆమెను ఎలాంటి ప్రశ్నలను అడుగుతారు, ఆ ప్రశ్నలకు కవిత ఏ విధమైన సమాధానాలు ఇస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.