తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మార్పు ఖాయమైంది. తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణ తదితరులతో కలిసి నిన్న బీజేపీ కీలక నేత, హోంశాఖ మంత్రి అమిత్ షాతో మర్రి శశిధర్ రెడ్డి భేటీ అవ్వడంతో ఆయన పార్టీ మారుడు ఖయమైనట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన కూడా స్పష్టత ఇచ్చారు. మర్రి పార్టీ మార్పు అంశంపై గత కొద్ది రోజులుగా వార్తలు వినబడుతున్నా రెండు రోజుల క్రితం ఆయన ఖండించారు. ఆ మరుసటి రోజే అమిత్ షాతో సమావేశం కావడం హాట్ టాపిక్ అయ్యింది. పార్టీ మార్పు అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ తో బాధపడుతోందనీ, ఇప్పట్లో ఆ క్యాన్సర్ నయమయ్యే సూచనలు కూడా లేవని అన్నారు. అందుకే ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వస్తుందని తెలిపారు. తనతో పాటు మరి కొందరు కాంగ్రెస్ నేతలు కూడా బయటకు వస్తున్నారంటూ మరో బాంబు పేల్చారు మర్రి శశిధర్ రెడ్డి.
ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పైనా సంచలన కామెంట్స్ చేశారు శశిధర్ రెడ్డి. రేవంత్ రెడ్డి తీరు సరిగాలేదనీ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలను ఆయన ఎంతో తేలికగా తీసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు వెళ్లిపోయినా అందుకు రేవంత్ రెడ్డిదే బాధ్యత అని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ను చెంచాగాళ్ల తో నడిపిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. మర్రి శశిధర్ రెడ్డి చేరికపై అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అందుకే శశిధర్ రెడ్డి తన వైఖరి స్పష్టం చేసినట్లుగా భావిస్తున్నారు. అయితే ఆయన తో పాటు కాంగ్రెస్ పార్టీని ఎవరెవరు వీడుతున్నారు అనేది మాత్రం శశిధర్ రెడ్డి తెలియజేయలేదు. శశిధర్ రెడ్డి బాటలో ఎవరెవరు ఉన్నారు అనేది ఇప్పుడు టీ కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది.