గత కొద్దికాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు , మంత్రి కేటీఆర్ కు ప్రమోషన్ దక్కనుందనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ రకాల పరిణామాల నేపథ్యంలో ఈ టాక్ వినిపిస్తోంది. అయితే, రాజకీయ వర్గాల నుంచి వినించే ఈ కామెంట్ల సంగతి అలా ఉంటే తాజాగా ఈ ప్రతిపాదన సొంత ఎమ్మెల్యే నుంచే వినిపించింది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మీడియాతో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి చేపెట్టే అన్ని అర్హతలు ఉన్నాయి అన్నారు.
కేటీఆర్ కు క్రేజ్ ఉంది సీఎం అవడమే…..
తెలంగాణ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న నాయకుడు కేటీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రశంసించారు. రాబోవు యువతరానికి, తెలంగాణ భవిష్యత్తుకు అసలైన మార్గదర్శకులు కేటీఆర్ మాత్రమేనని అన్నారు. అందుకే ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని లింగయ్య అన్నారు.
చిరుమర్తి సంచలనం….
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ తరఫున గెలిచి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. లింగయ్య పార్టీ మార్పుపై ఆయనతో సన్నిహిత రాజకీయాలు నెరిపిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. చిరుమర్తి నమ్మక ద్రోహం చేశాడని మండిపడ్డారు. తమతో చెప్పకుండానే పార్టీ మార్పు పై నిర్ణయం తీసుకుని నమ్మకం, విశ్వాసం అనే పదాలకు విలువ లేకుండా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. అభివృద్ధి కోసం అనే డొంక తిరుగుడు మాటలు చెప్పి, నీ స్వార్థం కోసం మమ్మల్ని వంచించావ్ అని ఆవేదన వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ నమ్మిన వారి కోసం ప్రాణం ఇస్తారని తెలంగాణ సమాజమంతా భావిస్తే.. ఆ నమ్మకానికే ద్రోహం చేశావ్.. నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు అని వ్యాఖ్యానించారు రాజగోపాల్రెడ్డి. నియోజకవర్గ కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దు… ఒక్క చిరుమర్తి పోయినంత మాత్రాన ఏమికాదు… మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాలను నారెండు కళ్లలాగా చూసుకుంటానంటూ ధైర్యాన్ని చెప్పారు. మా పార్టీకి చెందిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ఎంతకు కొన్నావ్ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు . అయితే, తాజాగా చిరుమర్తి ఈ సంచలన కామెంట్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి మరి.