ఏ కార్యక్రమం నిర్వహించినా దాని ద్వారా పార్టీకి మైలేజీ రావాలనేది రాజకీయ పార్టీల లక్ష్యం. అదే కోవలో నేడు తెలంగాణలో మూడు రకాల పేర్లతో వేడుకలు నిర్వహిస్తున్నాయి రాజకీయ పార్టీలు. రాబోయే ఎన్నికల్లో మరో సారి సత్తా చాటి అధికారాన్ని నిలబెట్టుకుని హాట్రిక్ సాధించాలన్న లక్ష్యంలో అధికార టీఆర్ఎస్, ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణలో పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీలు వాళ్ల ప్లాన్ లను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 17 వేడుకలను వివిధ పేర్లతో నిర్వహిస్తున్నాయి.
దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం రాగా, రజాకార్ల పాలన నుండి తెలంగాణకు సెప్టెంబర్ 17న విముక్తి లభించింది. హైదరాబాద్ స్టేట్ భారత యూనియన్ లో కలిసిన రోజు 1948 సెప్టెంబర్ 17. ఆనాటి నిజాం నవాబు నిరంకుశ పాలన గురించి, రజాకార్ల అకృత్యాల గురించి వాటిని ఎదుర్కొనేందుకు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాల గురించి నేటితరం వారికి తెలియకపోయినా వెనుకటి తరం వారు వాటిని కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్ స్టేట్ లో నాటి దురాగతాల నేపథ్యంలో 1948 సెప్టెంబర్ 13వ తేదీన భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరుట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. నాటి పోలీస్ యాక్షన్ నేపథ్యంలో సెప్టెంబర్ 17న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు. ఆ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాంత్య్రం వచ్చింది. సెప్టెంబర్ 17న రజాకార్ల పాలన నుండి విముక్తి లభించిన రోజు కాబట్టి ఆ రోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని బీజేపీ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తూ వచ్చింది. తాము తాము అధికారంలోకి వస్తే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెబుతూ వస్తొంది.
2014 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీజేపీ పార్టీ పరంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తూ వచ్చింది. వచ్చే ఏడాది తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ రాజకీయ లక్ష్య సాధనలో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ 17 నుండి 2023 సెప్టెంబర్ 17 వరకూ తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించింది. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హజరైయ్యారు.
ఈ క్రమంలోనే తెలంగాణలోని టీఆర్ఎస్ సర్కార్ కూడా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరిట ఏడాది పాటు ఘనంగా వేడుకలను నిర్వహించింది. అందులో భాగంగా మూడు రోజుల పాటు వజ్రోత్సవ ప్రారంభ వేడుకలను చేపట్టి నిర్వహిస్తొంది. ఈ వేడుకలకు తాము కూడా మద్దతు ఇస్తున్నట్లు ఎంఐఎం ప్రకటించింది. సమైక్యతా వజ్రోత్సవాలలో పాత బస్తీ ప్రజలు పాల్గొనాలని ఎంఐఎం పిలుపు నిచ్చింది. ఇలా ఈ వేడుకలను టీఆర్ఎస్, బీజేపీ తమ కు అనుకూలంగా మార్చుకుని నిర్వహిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరో పేరుతో వేడుకల నిర్వహణకు సిద్దమైంది. తెలంగాణ స్వాతంత్య్ర వేడుకల పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తొంది. ఇప్పుడు తెలంగాణలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు మూడు పేర్లతో వేడుకలు నిర్వహించడం హాట్ టాపిక్ అయ్యింది.