Sharmila : తెలంగాణ Telangana రాజకీయాల్లో ప్రవేశించడానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి YS Rajasekar reddy తనయ షర్మిల Sharmila డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నిన్న నల్లగొండ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో సమావేశమైన షర్మిల వారి నుండి సలహాలు, సూచనలు తీసుకున్నారు. తన ఉద్దేశాన్ని తెలియజేశారు. ప్రస్తుతం తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు, తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తాను అంటూ షర్మిల ప్రకటించారు. ఇంత వరకూ బాగానే ఉంది. ఏపిలో సోదరుడు వైఎస్ జగన్ సీఎంగా ఉండగా..షర్మిల అర్ధాంతరంగా తెలంగాణలో ఎందుకు పార్టీ పెడుతున్నారు? దీని వెనుక ఎవరు ఉన్నారు? అనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. హైదరాబాద్ లో షర్మిల కార్యక్రమాన్ని నిన్న దాదాపు అన్ని టీవి ఛానల్స్ లో చూపగా తన సోదరుడికి చెందిన సాక్షి ఛానల్ లో అసలు ఈ కార్యక్రమం టెలికాస్ట్ చేయలేదంటే ఇది ఒక వ్యూహాత్మకమేనని భావిస్తున్నారు.
Sharmila : బీజెపీ బలపడకుండా చేయడానికేనా?
ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజెపీ తయారు అవుతున్నది అనేది అందరికీ తెలిసిందే. కెసిఆర్ రెండవ సారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలను టీఆర్ఎస్ లో చేర్చుకుని కాంగ్రెస్ పార్టీని చాలా వరకు బలహీన పర్చారు. ఇదే క్రమంలో బీజెపీ తన బలాన్ని పుంజుకుంటోంది. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ స్థానాలు కైవశం చేసుకున్న నాటి నుండి తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అంటూ చెప్పుకొస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజెపీ అభ్యర్థి రఘునందనరావు విజయం సాధించడం, ఆ తరువాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు స్థానాల నుండి 45కి పైగా కార్పోరేటర్ స్థానాలు కైవశం చేసుకోడంతో బీజేపీ చాలా జోష్ లో ఉంది. ఇదే ఊపుతో బీజెపీ కొనసాగితే రానున్న రోజుల్లో టిఆర్ఎస్ కు నష్టం జరుగుతుందని ఊహించిన కేసిఆర్ తెరవెనుక ఉండి షర్మిల తో కొత్త పార్టీ ఏర్పాటు చేయిస్తున్నారనే పుకారు ఉంది. ప్రధానంగా తెలంగాణలో బలమైన రెడ్డి సామాజిక వర్గం బీజెపీ వైపు వెళ్లకుండా చేయాలనే షర్మిలతో కొత్త పార్టీ ఏర్పాటు చేయించారని ప్రచారం నడుస్తోంది.
విమర్శలు వద్దన్న అంతర్గత సూచన దేనికి సంకేతం
నిన్న లోటస్ పాండ్ లో కొత్త పార్టీ అంటూ షర్మిల హడావుడి నడుస్తున్న సమయంలో టిఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున షర్మిలపై విమర్శలు చేస్తూ ట్రోల్స్ చేసింది. అయితే తరువాత వాటిని తొలగించారు. అదే విధంగా మంత్రి గంగుల కమలాకర్ కూడా షర్మిల పార్టీ ఏర్పాటుపై తొలుత విమర్శలు చేసి తరువాత మౌనం వహించారు. షర్మిల పార్టీ ఏర్పాటు విషయంలో టీఆర్ఎస్ శ్రేణులు పెద్దగా రియాక్ట్ కావదని, వ్యతిరేక విమర్శలు చేయవద్దంటూ ఆ పార్టీ అధిష్టానం నుండి ఆదేశాలు రావడం వల్ల సోషల్ మీడియా పోస్టులను డిలీట్ చేశారనీ, మంత్రులు కూడా పెద్దగా మాట్లాడటం లేదని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు పలువురు షర్మిల రాజకీయ పార్టీ వెనుక కెసిఆర్ హస్తం ఉందని విమర్శలు చేస్తూనే ఉన్నారు. అందుకే ఆ పార్టీ నేతలను షర్మిల రాజకీయ పార్టీ పై విమర్శలు చేయవద్దని కట్టడి చేస్తున్నారని అంటున్నారు.