Sharmila : తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్నదే తన లక్ష్యం అంటూ రాజకీయ అరంగ్రేటం చేస్తున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిలకు షాక్లు ఇవ్వడానికి టీఆర్ఎస్ సిద్ధమైనట్లు కనబడుతోంది. రాజకీయ పార్టీ పేరు, ఇతర విషయాలను స్పష్టంగా వెల్లడించనప్పటికీ షర్మిల అందుకు అనుగుణంగా ఫ్లాట్ ఫామ్ సిద్దం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రప్రధమంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వైసీపీ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన షర్మిల ఆ తరువాత హైదరాబాదు, రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశమైయ్యారు.
షర్మిల వెంట నడిచేది ఎవరంటే..?
షర్మిల రాజకీయ పార్టీ వెనుక ఎవరు ఉన్నారు అనే దానిపై అనేక రకాల ఊహాగానాలు, పుకారులు షికారు చేస్తున్నా ఆమె మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనబడుతోంది. షర్మిల పార్టీ పెడితే రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనే దానిపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అన్న చర్చ జరుగుతుంది. అదే విధంగా షర్మిల పార్టీలో ఏవరెవరు చేరనున్నారు అనేది ఇప్పటి వరకూ క్లారిటీ అయితే లేదు కానీ వైఎస్ఆర్ ద్వారా రాజకీయంగా ఎదిగిన కొందరు నేతలు మాత్రం షర్మిల వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి షర్మిల పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. అదే విధంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం నుండి సబితా ఇంద్రారెడ్డి వర్గానికి చెందిన కొంత మంది కీలక నేతలు కూడా షర్మిల వెంట నడిచే అవకాశం ఉందని టాక్. వైఎస్ఆర్ అభిమానులు, ఆయన ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వారిలో కొందరు భవిష్యత్తు రాజకీయాలపై ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారుట.
Sharmila : షర్మిల వ్యూహాత్మక అడుగులు – బాణాలు సిద్ధం చేస్తున్న కెసిఆర్?
మరో పక్క షర్మిల తన వ్యూహాత్మక అడుగుల్లో భాగంగా సలహాదారులుగా రిటైర్డ్ ఐఏఎస్ ప్రభాకరరెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ ఉదయ సిన్హాలను నియమించుకున్నారు. వైఎస్ హయాంలో ఉదయసిన్హా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పని చేయగా, ప్రభాకరరెడ్డి సీఎంవోలో అడిషనల్ సెక్రటరీగా పని చేశారు. ఈ పరిణామాలు చూస్తుంటే షర్మిల పార్టీ ఏర్పాటుకు ముందే గ్రౌండ్ వర్క్ గట్టిగా చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. షర్మిల రాజకీయ పార్టీపై మొదట్లో టిఆర్ఎస్ శ్రేణులు ఎవరూ పెద్దగా స్పందించవద్దని ఆ అధిష్టానం నుండి ఆదేశాలు వచ్చాయన్న ప్రచారం జరిగింది. కానీ సీఎం కెసిఆర్ సన్నిహితులైన పలువురు మంత్రులు షర్మిల రాజకీయంపై కీలక వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్నారు. షర్మిలకు గట్టి షాక్ ఇవ్వడానికి ఇవి కెసిఆర్ వేయిస్తున్న బాంబులేనని ప్రచారం జరుగుతోంది. షర్మిలపై మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సమాజం ఇప్పుడు షర్మిలను రానిస్తే ఆ వెంటనే జగన్, తరువాత చంద్రబాబు వస్తారని, మళ్లీ తెలంగాణపై ఆంధ్రా నాయకుల పెత్తనం సాగిస్తారని ఆరోపించారు. పోరాడి సాధించిన తెలంగాణను నిలుపుకోవాలంటే కేసిఆర్ కు తెలంగాణ సమాజం మొత్తం అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇలా ఒక్కరొక్కరు టీఆర్ఎస్ ముఖ్య నేతలు షర్మిల పై ఆంధ్ర ప్రాంతీయత ముద్ర వేస్తూ విమర్శిస్తున్నారు.