TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. సిట్ దర్యాప్తునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నంద కుమార్. సింహాయాజీలను విచారించడంతో పాటు వారి నివాసాల్లో సోదాలు జరిపిన సిట్ అధికారులు వీరి వెనుక ఎవరు ఉన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలునకు కోట్ల రూపాయలు ఎవరు ఇస్తామన్నారు తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసుతో సంబంధం ఉన్న అనుమానితులను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతోంది. కొందరిని విచారణకు హజరుకావాలని నోటీసులు జారీ చేస్తొంది సిట్. విచారణలో సహకరించకపోతే వారిని అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చి, కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశాలు ఉంటాయి.
TRS MLAs poaching case
బండి సంజయ్ అనుచరుడికి నోటీసులు
తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడైన బూసారపు శ్రీనివాస్ అనే వ్యక్తికి సిట్ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21వ తేదీ 10.30 గంటలకు విచారణకు హజరుకావాలని 41 సీఆర్పీసీ నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, సింహయాజీలకు బూసారపు శ్రీనివాస్ విమాన టికెట్లు బుక్ చేశారన్న ఆరోపణలు రావడంతో అధికారులు ఆయనను విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో నిందితులకు శ్రీనివాస్ విమాన టికెట్లు బుక్ చేసిన విషయం నిజమేనా..? ఒక బుక్ చేసి ఉంటే ఎందుకు చేశారు.. ? ఎవరు చేయమన్నారు..? వాళ్లకు శ్రీనివాస్ కు మధ్య ఉన్న సంబంధం ఏమిటి..? అనే విషయాలను సిట్ ఆరా తీయనున్నది.
తొలుత మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం బయటకు రావడంతోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ వ్యవహారం బీజేపీకి, తనకు సంబంధం లేదంటూ యాదాద్రి గుడికి వెళ్లి ప్రమాణం చేశారు. అయితే ఇప్పుడు ఈ కేసులో బండి సంజయ్ అనుచరుడికి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై బండి సంజయ్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. మరో పక్క ఇదే కేసులో కేరళకు చెందిన ఎన్డీఏ నాయకుడు తుషార్ కు కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయనను 21వ తేదీ విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడైన రామచంద్రభారతి, ఫిర్యాదిదారుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో తుషార్ ఫోన్ లో మాట్లాడినట్లుగా అధికారులు గుర్తించారు.