MLAs poaching case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీం కోర్టులో తెలంగాణ సర్కార్ ఊహించిన ఊరట లభించలేదు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఎమ్మెల్యేల కొనుగోలు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సిట్ దర్యాప్తు కొనసాగించేందుకు వీల్లేదనీ, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. సిట్ దర్యాప్తు నకు సంబంధించిన రికార్డులన్నీ సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది. దీంతో సీబీఐ దర్యాప్తు జరపాలన్న హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. గత విచారణ సందర్భంలోనూ స్టే ఇవ్వడానికి నిరాకరించిన ధర్మాసనం .. విచారణను నేటికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. పలు కీలక అంశాలు ధర్మాసనం ముందు వినిపించారు. సిట్ దర్యాప్తులోని ఆధారాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయనీ, ఈ క్రమంలో కేసు విచారణను సీబీఐకి ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. కేసుపై వాదనల కోసం తనకు ఎక్కువ సమయం కావాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. మరో పక్క హైకోర్టు ఆదేశాల మేరకు కేసు ఫైళ్లు అందజేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సీబీఐ ఇప్పటికే అయిదు పర్యాయాలు లేఖలు రాసింది. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే ఉత్తర్వులు ఇవ్వని నేపథ్యంలో సీబీఐ తదుపరి విచారణ వరకూ ఆగుతుందా లేక కేసు అప్పగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందా అనేది తెలియాల్సి ఉంది.