Congress : కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఒకింత గ్యాప్ తర్వాత మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లాలో బలమైన క్యాడర్ ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన రాజగోపాల్ రెడ్డి చాలా రోజుల నుండి కాంగ్రెస్ కు అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఆయన గతంలో బీజేపీ లో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. దీనికి కొనసాగింపుగా ఈ దఫా ఆయన చేసిన కామెంట్లు కొత్త చర్చకు దారితీస్తున్నాయి.
Congress కోమటిరెడ్డి లెక్క ఏంటి?
టీఆర్ఎస్ ను గద్దె దించాలంటే ఇప్పుడు బీజేపీకే సాధ్యం అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తనని బీజేపీ లోకి రమ్మని ఇప్పటికీ సంప్రదింపులు జరుగుతున్నాయని, నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయమని కొన్ని రోజుల నుండి నన్ను బీజేపీ నాయకులు అడుగుతున్నారు అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. దానికి సంబంధించి తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. బీజేపీ నుంచి నేను నాగార్జున సాగర్ లో పోటీ చేస్తే పోటీ బీజేపీ టీఆర్ఎస్ మధ్యనే ఉంటుందని ఒక వేళ తాను బీజేపీ నుంచి పోటీ చేస్తే జానారెడ్డికి ముడో స్థానమే అని అన్నారు.
గతంలో తానే సీఎం అని..
బీజేపీ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఓ కార్యకర్తతో చెప్పిన వ్యాఖ్యలు గతంలో వైరల్ అయ్యాయి. లక్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజగోపాల్రెడ్డికి ఫోన్ చేసి, పార్టీని వీడడం బాధగా ఉందని చెప్పగా.. ‘కాంగ్రెస్ బతకదు. రాహుల్ గాంధీయే రాజీనామా చేశారు. ఈ పార్టీ ముసలిది అయిపోయింది. అందరం కలిసి బీజేపీకి పోదాం. అధైర్యపడొద్దు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే నేనే సీఎంనవుతా’ అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. ఓ కార్యకర్తతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి జరిపిన ఫోన్ సంభాషణ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోగా… తాజాగా ఆయన చేసిన కామెంట్లు అదే స్థాయిలో హాట్ టాపిక్ గా మారాయి.