TPCC: టీ కాంగ్రెస్ నేతల్లో గ్రూపు విభేదాలను పరిష్కరించి పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా మరో మారు హైదరాబాద్ గాంధీ భవన్ ఇవేళ టీపీసీసీ విస్తృత స్థాయి భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేయాలని నేతలు డిమాండ్ చేశారు. పాదయాత్రతోనే పార్టీ మనుగడ ఉంటుందని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ పేర్కొన్నారు. గతంలో వైఎస్ఆర్ పాదయాత్ర తో అధికారంలోకి వచ్చామని గుర్తు చేశారు. సీఎం కేసిఆర్ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ సమయంలో పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళితేనే కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయని అన్నారు.
పీసీసీ గానీ సీఎల్పీ గానీ లేదా ఇద్దరు కలిసి అయినా పాదయాత్ర చేయాలని ఎమ్మెల్యే పాడెం వీరయ్య కోరారు. మాజీ మంత్రి గీతారెడ్డి కూడా పాదయాత్ర చేయాలని కోరారు. జనవరి 26 నుండి జూన్ 2వ తేదీ వరకూ పాదయాత్ర చేయబోతున్నానని గతంలో రేవంత్ రెడ్డి ప్రకటించగా, రేవంత్ రెడ్డి పాదయాత్రకు అధిష్టానం అనుమతి లేదంటూ పలువురు సీనియర్ నేతలు పేర్కొన్నారు. రేవంత్ పాదయాత్రపై సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో ఇవేళ జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలువురు నేతలు రేవంత్ పాదయాత్ర చేయాలని కోరారు. సమావేశంలో హాత్ సే హాత్ జోడో అభియాన్, రేవంత్ రెడ్డి పాదయాత్ర తదితర అంశాలపై చర్చించారు.
సమావేశం అనంతరం పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ అనుకూలం, ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు. పార్టీ అధిష్టానం చెప్పింది చేయడమే తన విధి అని పేర్కొన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రతో రాహుల్ సందేశాన్ని ప్రతి ఇంటికి నేతలు తీసుకువెళ్లాలన్నారు. రేవంత్ రెడ్డి 50 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తారని తెలిపారు. సీనియర్ లు కూడా 30 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని అన్నారు. నేతలు అంతా ఐక్యంగా హాత్ సే హాత్ జోడో యాత్ర చేయాలని సూచించారు. అంతా ఐక్యంగా పని చేస్తేనే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. పార్టీలో పరాయి అన్న భావన ఉండ కూడదనీ, అందరూ ఐక్యంగా పని చేయాలని సూచించారు. పార్టీలో ఏమైనా సమస్యలు ఉంటే నేతలు తనతో నేరుగా చర్చించాలన్నారు. పార్టీకి నష్టం జరిగేలా ఎవరూ మాట్లాడవద్దని హితవు పలికారు.
ఈ నెల 26 నుండి హాత్ సే హాత్ జోడో యాత్ర
ఈ నెల 26వ తేదీ నుండి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. యాత్రలో ఒక రోజు సోనియా గాంధీ లేక ప్రియాంక పాల్గొంటారని చెప్పారు. తాను భద్రాచలం నుండి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రెండు నెలల పాటు సాగే ఈ పాదయాత్రను ఫిబ్రవరి 6వ తేదీ నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మాణిక్ రావు ఠాక్రే భేటీలకు మూడు సార్లు పాల్గొనని నేతల నుండి వివరణలు తీసుకుంటామని చెప్పారు. కీలక సమయాల్లో సమావేశాలకు రాని నేతలను పార్టీ నుండి తొలగించేలా చర్యలు తీసుకుంటామని బాంబ్ పేల్చారు రేవంత్ రెడ్డి.
జగన్ సర్కార్ కీలక నిర్ణయం .. వారి పదవీ కాలం పొడిగింపు