తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారుడు ఖాయమేననే వాదనలు వినబడుతున్నాయి. గత కొద్ది రోజులుగా మర్రి మార్పు మార్పుపై వార్తలు వస్తూనే ఉన్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంపై మర్రి అసంతృప్తిగా ఉన్నారనేది అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన ఢిల్లీకి చేరడంతో బీజేపీలో చేరడానికే వెళ్లారంటూ వార్తలు రాగా, ఆ వార్తలను ఆయన ఖండించారు. వ్యక్తిగత పనుల మీద ప్రతి నెలా ఢిల్లీకి వస్తుంటాననీ, తను ప్రయాణించిన విమానంలో అన్ని పార్టీల నేతలు ఉన్నారని పేర్కొన్నారు. బీజేపీ నాయకురాలు డీకే అరుణతో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్లినట్లుగా తొలుత వార్తలు వచ్చాయి.
అయితే ఆ వార్తలను ఖండించిన మరుసటి రోజే అంటే శుక్రవారం నాడు బీజేపీ కీలక నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మర్రి శశిధర్ రెడ్డి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణలతో కలిసి మర్రి శశిధర్ రెడ్డి అమిత్ షాతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై అమిత్ షాతో చర్చించారు. ఇదే సందర్భంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు జరిపిన దాడి విషయాన్ని అమిత్ షా కు బండి సంజయ్ వివరించగా, ఆయన వెంటనే స్పందించి అరవింద్ తో ఫోన్ లో మాట్లాడి దాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కాగా అమిత్ షా తో మర్రి శశిధర్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మర్రి వారం రోజుల్లో బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై మర్రి శశిధర్ రెడ్డి ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం, బీజేపీ అగ్రనేతతో సమావేశం కావడంపై తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కూడా ఇంత వరకూ స్పందించలేదు. ఒకటి రెండు రోజుల్లో మర్రి శశిధర్ రెడ్డి నుండి గానీ టీ కాంగ్రెస్ నుండి కానీ ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద భారీ పోలీసు బందోబస్తు