T Congress: కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హూజూరాబాద్ ఉప ఎన్నికల పంచాయతీ ఢిల్లీకి చేరిన సంగతి తెలిసిందే. హూజారాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కకపోవడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పలువురు నేతలు తప్పుబడుతున్న విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ గెలుపునకు రేవంత్ పరోక్షంగా సహకరించాలని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. హూజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిపై సమీక్ష జరిపేందుకు గానూ ఏఐసీసీ పిలుపు మేరకు అభ్యర్ధి వెంకట్ బల్మూరుతో సహా 13 మంది నేతలు ఢిల్లీకి చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఆధ్వర్యంలో హూజూరాబాద్ లో ఓటమిపై సమీక్షలో వాడివేడి చర్చ సాగింది. ఈ సమావేశంలో టీపీసీసీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు.
T Congress: భట్టిపై వేణుగోపాల్ ఆగ్రహం
ఈటల రాజేందర్ ను పార్టీలో చేర్చుకుని ఉంటే బాగుండేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రస్తావించారు. ఈటల కాంగ్రెస్ లోకి రాకుండా కొందరు అడ్డుకున్నారని వ్యాఖ్యలు చేశారు. దీనిపై భట్టి వ్యాఖ్యలపై కేసి వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటలను పార్టీలో చేర్చుకోవద్దని నువ్వే చెప్పి ఇప్పుడు ఇతరులపై నిందలు ఎందుకు వేస్తున్నావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేసి వేణుగోపాల్.
పద్ధతి మార్చుకోకపోతే పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది
ఈ సందర్భంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయకుల మధ్య సమన్వయ లోపమే హుజూరాబాద్ లో ఓటమికి కారణమని పేర్కొన్న పొన్నం ప్రభాకర్.. గతంలో పీసీసీ అధ్యక్షులుగా పని చేసిన నేతలపైనా ఆరోపణలు చేశారు. పీసీసీ అధ్యక్షులుగా చేసిన కే కేశవరావు, డీ శ్రీనివాస్ లు రాజ్యసభ పదవుల కోసం కాంగ్రెస్ కు మోసం చేశారని అన్నారు. ఇప్పుడు మాజీ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన బంధువు పాడి కౌశిక్ రెడ్డి పార్టీ వీడేందుకు సహకరించి ఎమ్మెల్సీ పదవి ఇప్పించారని కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలోని నేతలు పద్ధతి మార్చుకోకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ కు సహకరిస్తున్నారని విమర్శించిన పొన్నం…కేవలం హుజూరాబాద్ ఓటమిపైనే కాకుండా నాగార్జునసాగర్, దుబ్బాక ఓటములపైనా సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. జూన్ లో కౌశిక్ రెడ్డి పార్టీ వీడితే ఎన్నికల ముందు వరకూ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జిని ఎందుకు నియమించలేదంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.