T Congress: జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ లో గ్రూపు రాజకీయాలకు కొదవ ఉండదు. దశాబ్దాల కాలంగా గ్రూపు పాలిటిక్స్ కొనసాగుతూనే ఉన్నాయి. సమ్మతి, అసమ్మతి నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతుండటం, స్వపక్ష నేతలపై విమర్శలు చేయడం చాలా సందర్భాల్లో చూశాం. పార్టీ కేంద్ర నాయకత్వంతో అనుకూలంగా వ్యవహరిస్తూనే రాష్ట్రాల్లో గూపు రాజకీయాలను కొందరు నెరపుతూ ఉండేవారు. ఈ పార్టీ నాయకుల్లో వాక్ స్వాతంత్రం ఎక్కువ. ఎవరు ఎవరిపైనైనా మాట్లాడుతూ ఉండేవారు. గ్రూపు రాజకీయ నేతలపై పార్టీ అధిష్టానం కూడా గతంలో అంతగా పట్టించుకునేది కాదు. దీంతో పలువురు సీనియర్ నాయకులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తుండేవారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలోనూ, అటు కేంద్రంలోనూ అధికారాన్ని కోల్పోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో మార్పు వచ్చినట్లు కనబడుతోంది. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఈ క్రమంలో భాగంగా యంగ్ స్టర్ లకు, దూకుడుగా వ్యవహరించే నేతలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తూ కేంద్ర నాయకత్వం ప్రోత్సహిస్తుంది. దిక్కార స్వరం వినిపించే వారిపై సీరియస్ గానే వ్యవహరిస్తూ పార్టీ లో క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. అందుకు ఉదహారణగా జగ్గారెడ్డి ఇష్యూను చెప్పవచ్చు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై అనుచిత కామెంట్స్ చేసిన సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహరంలో పార్టీ అధిష్టానం స్పందించిన తీరు మార్పునకు (నయా ట్రెండ్) సంకేతంగా చెప్పవచ్చు. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి దక్కకుండా చేయడం కోసం పలువురు సీనియర్ లు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసినా అన్ని అడ్డంకులు అధిగమించి పీసీసీ పగ్గాలు చేపట్టారు రేవంత్ రెడ్డి. రేవంత్ పీసీసీ బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణ కాంగ్రెస్ లో ఒక జోష్ వచ్చింది. దళిత దండోరా సభలు సక్సెస్ అయ్యాయి. పార్టీ బలోపేతం అవుతుందని క్యాడర్ కూడా ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమపై పార్టీ అధిష్టానం పూర్తి సంతృప్తితో ఉంది.
ఈ తరుణంలో సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడి ఇది కాంగ్రెస్ పార్టీ నా లేక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీయా, హీరోయిజం చేయడంలో కాంగ్రెస్ లో కుదరదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై గంటల వ్యవధిలోనే పార్టీ అధిష్టానం స్పందించింది. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాకూర్ సీరియస్ అయ్యారు. జగ్గారెడ్డికి గట్టిగా క్లాస్ పీకడంతో వెనక్కు తగ్గారు. మీడియా ఎదుట తాను మాట్లాడటం తప్పేనని అంగీకరించారు జగ్గారెడ్డి. తాము అన్నదమ్ముల్లాంటి వాళ్లమనీ, కలిసి మాట్లాడుకుంటాం, కలిసి పని చేస్తామని పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారాన్ని వ్యక్తం చేశారు. దీంతో జగ్గారెడ్డి వ్యాఖ్యల దుమారం టీ కప్పులో తుఫానులా సమసిపోయింది. జగ్గారెడ్డి వ్యాఖ్యల విషయంలో పార్టీ అధిష్టానం వ్యవహరించిన తీరుతో భవిష్యత్తులో ఇలాంటివి పునరావృత్తం కాకుండా ఉండేందుకు దోపదపడతుందన్న మాట వినబడుతోంది.