తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి కుమారుడు బండి భగీరధ్ చర్యలు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. హైదరాబాద్ లోని మహీంద్రా యూనివర్శిటీలో చదువుతున్న బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ఓ జూనియర్ విద్యార్ధిని బండ బూతులు తిడుతూ చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర సంచలనం అయ్యింది. ఇందులో బాధితుడు ఫిర్యాదు చేయనప్పటికీ కళాశాల యాజమాన్యం ఫిర్యాదుతో బండి భగీరథ్ పై ఐపీసీ 341, 323, 504, 34 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. మరో పక్క కళాశాల యాజమాన్యం కూడా భగీరథ్ పై చర్యలు తీసుకుంది.యూనివర్శిటీ నుండి భగీరథ్ ను సస్పెండ్ చేసింది.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే .. తొలుత వైరల్ అయిన వీడియోలోని బాధితుడు .. ఇది గతంలో జరిగిందనీ, తాను తప్పు చేస్తేనే కొట్టడం జరిగిందనీ, ఒక విద్యార్ధినికి తాను మెసేజ్ పెడితే భగీరథ్ కొట్టారనీ, ఆ తర్వాత తాము కాంప్రిమైజ్ అయ్యామనీ, ఇప్పుడు తాము స్నేహితులుగా ఉన్నామని వీడియో రిలీజ్ చేయడంతో ఈ వివాదం సమసిపోతుందని భావిస్తున్న తరుణంలో భగీరథ్ సహా మరి కొందరు జూనియర్ ను ర్యాగింగ్ చేస్తున్న వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తొంది.
రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూనివర్శిటీ యజమాన్యం భరీరథ్ ను సస్పెండ్ చేసింది. అయితే ఈ వీడియోలు వైరల్ చేయడంపై బీజేపీ శ్రేణులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకే కొందరు కుట్ర చేస్తున్నారని, తన కుమారుడిని అడ్డు పెట్టుకుని డ్రామాలాడుతున్నారని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. దమ్ముంటే తనతో నేరుగా రాజకీయాలు చేయాలి కానీ తన కుమారుడి వీడియోలు వైరల్ చేసి నీచ రాజకీయాలు చేయడం సరికాదని బండి సంజయ్ అంటున్నారు. తన కుమారుడు తప్పు చేసి ఉంటే తానే స్వయంగా పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేస్తానని బండి సంజయ్ చెబుతున్నారు. ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.