Teenmar Mallanna arrest: క్యూ న్యూస్ అధినేత, జర్నలిస్ట్ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ను హైదరాబాద్ లోని చిలకలగూడ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. జ్యోతిష్య పండితుడు సన్నిధానం లక్ష్మీకాంత్ శర్మ గతంలో చేసిన ఫిర్యాదుపై మల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు. మల్లన్న తనను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశాడని లక్ష్మీకాంత్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.30 లక్షలు ఇవ్వాలనీ తనను మల్లన్న డిమాండ్ చేశారనీ, ఇవ్వకపోతే తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేసి పేరు చెడగొడతానని బెదిరించారని లక్ష్మీకాంత్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఏప్రిల్ నెలలోనే కేసు నమోదు చేశారు. ఇప్పటికే తీన్ మార్ మల్లన్నకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టిన పోలీసులు శుక్రవారం రాత్రి ఆకస్మికంగా అరెస్టు చేశారు.
గురువారం పోలీసులు తీన్ మార్ మల్లన్న నివాసంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు, పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసిఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై గత కొంత కాలంగా క్యూన్యూస్ లో వ్యతిరేక కథనాలు, వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
కాగా సీతాఫల్ మండిలోని మధురానగర్ లో మారుతీ జ్యోతిష్యాలయం అనే సంస్థను లక్ష్మీకాంత్ శర్మ నిర్వహిస్తున్నారు. ఈ జ్యోతిష్యాలయంపై ఇటీవల క్యూ న్యూస్ లో వరుస కథనాలు ప్రసారం చేశారు, ఈ క్రమంలోనే తనను డబ్బుల కోసం బెదిరింపులకు దిగారని లక్ష్మీకాంత్ శర్మ ఆరోపించారు.
ఈ నెల మొదటి వారంలో ప్రియాంక అనే యువతి ఫిర్యాదు మేరకు తీన్ మార్ మల్లన్న పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నాడు సైబర్ క్రైమ్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ బృందం, స్పెషల్ ఆపరేషన్ టీమ్ అధికారులు క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేసి మల్లన్నను అదుపులోకి తీసుకోవడంతో పాటు ఆ సంస్థ కార్యాలయం నుండి కొన్ని హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. అయితే నాడు మల్లన్నను అరెస్టు చేయకుండా విచారణ చేసి వదిలి పెట్టారు. ఇప్పుడు లక్ష్మీకాంత్ శర్మ ఫిర్యాదుపై మల్లన్నను అరెస్టు చేశారు.