బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పై ఉత్కంఠ కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా బాంసా నుండి అయిదవ విడత పాదయాత్ర ప్రారంభించాల్సి ఉండగా ఆయనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. యాత్ర కోసం ఆయన నిన్న రాత్రి బైంసా కు వెళుతుండగా పోలీసులు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారులో అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అక్కడ నుండి కరీంనగర్ లోని ఆయన నివాసానికి తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన ఇంటి నుండి బయటకు రాకుండా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇంతకు ముందు మాదరిగా పాదయాత్ర అనుమతి కోసం బీజేపీ నేడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చే ఆదేశాలతో ఈ మధ్యాహ్నానికి బండి సంజయ్ పాదయాత్రపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
వాస్తవానికి ఈ రోజు బండి సంజయ్ అయిదవ విడత మహాసంగ్రామ పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహరాష్ట్ర డిప్యూటి సీఎం దేవేంద్ర పడ్నవీస్ హజరు కావాల్సి ఉండగా, పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో దేవంద్ర ఫడ్నవీస్ రాకపై అయోమయం నెలకొంది. మరో పక్క బండి సంజయ్ పాదయాత్రకు పోలీసుల అనుమతి నిరాకరించడంపై బీజేపీ నేతలు కేసిఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజాస్వామాన్యాన్ని కేసిఆర్ ఖూనీ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం జరుగుతున్న తరుణంలో సంజయ్ పాదయాత్రపై సందిగ్దత కొనసాగుతోంది.
బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో బైంసాలో పోలీసులు ఆంక్షలు విధించారు. బీజేపీ బహిరంగ సభ స్థలం వైపుకు ఎవరినీ అనుమతించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం వద్ద ఉన్న వారిని పోలీసులు బయటకు పంపించివేశారు.