BJP: తెలంగాణలో 2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఓ మంచి అస్త్రంగా మారుతున్నారా…కేసిఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ను రాష్ట్రంలో దెబ్బతీయడానికి ఈటల బీసీ కార్డు ఉపయోగపడుతుందా..ఆయనను రాబోయే ఎన్నికల నాటికి సీఎం అభ్యర్ధిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. గతంలో ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో ఉన్న నాయకులకే అధిక ప్రాధాన్యత ఇచ్చే బీజేపీ రానురాను వివిధ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన నేతలకు కీలక పదవులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే ఏపిలో కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. అదే విధంగా ఏపిలో పవన్ కళ్యాణ్ చరిష్మా, కాపు ఫ్యాక్టర్ కలిసి వస్తుందని భావించిన బీజేపీ … పవన్ ను సీఎం అభ్యర్ధిగా ప్రొజెక్టు చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు ఎదురొడ్డి నిలిచి తన సత్తా చాటిన ఈటలను రాబోయే ఎన్నికల నాటికి బీజేపీ తమ సిఎం అభ్యర్ధిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
BJP: త్వరలో కీలక పదవి
హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత ఈటల రాజేందర్ వ్యక్తిగతంగా ఇమేజ్ పెరగడంతో పాటు బీజేపీలో ఆయనకు ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల నుండి వినబడుతోంది. ఈ క్రమంలోనే ఈటలను బీజేపీ శాసనసభా పక్ష నేతగా చేస్తారన్న మాట వినబడుతోంది. ఎందుకంటే ఇప్పటికే రాజాసింగ్, రఘునందరావులు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ వీరితో పోలిస్తే ఈటల రాజేందర్ సీనియర్ ఎమ్మెల్యే, ఇప్పటికే ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మాజీ మంత్రి. ఉద్యమ నేపథ్యంతో పాటు బలహీన వర్గాలకు చెందిన నాయకుడు. ఇన్ని అర్హతలు ఉన్నందున ఈటలకు బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకునే అవకాశం ఉందని అంటున్నారు. టీఆర్ఎస్ అధికారంలో లేనప్పుడు అంటే 2014లో కేసిఆర్ పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న సమయంలో ఈటల టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు. అసెంబ్లీలో కేసిఆర్ ను ఎదుర్కొవడానికి ఈటలను బీజేపి అస్త్రంగా ఉపయోగించుకుంటుంది అంటున్నారు.
కేసిఆర్ వర్సెస్ ఈటలగానే పోటీ
హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా కేసిఆర్ వర్సెస్ ఈటలగానే జరిగిన విషయం తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే హూజూరాబాద్ లో టీఆర్ఎస్ పై బీజేపీ విజయం అనే కంటే కేసిఆర్ పై ఈటల విజయంగా భావిస్తున్నారు. దీన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసిఆర్ వర్సెస్ ఈటల వ్యూహాన్ని అమలు చేస్తే బీజేపీ లాభపడుతుందనీ అనుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుండి కేసిఆర్ వెన్నంటి నడిచిన ఈటలకు టీఆర్ఎస్ లో వ్యక్తిగతంగా స్ట్రేచర్ ఉన్న నాయకులతో సన్నిహిత సంబందాలు ఉన్నకారణంగా ఈటల ద్వారా టీఆర్ఎస్ ను బలహీన పర్చడానికి బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే పార్టీ ఈటలకు ప్రాధాన్యత పెరిగితే కిషన్ రెడ్డి బండి సంజయ్. రఘునందనరావు, రాజా సింగ్ వంటి సీనియర్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు అనేదానిపై బీజెపి నాయకత్వం ఒక స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది. చూడాలి రాబోయే రోజుల్లో బీజేపీ రాజకీయ వ్యూహం ఏ విధంగా ఉంటుందో.